మోడీ అంటే వణికిపోతున్నారు: కేసీఆర్పై జైపాల్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమన్నా, ప్రధాని నరేంద్ర మోడీ అన్నా..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమన్నా, ప్రధాని నరేంద్ర మోడీ అన్నా.. కేసీఆర్కు వణుకుపుడుతోందని అన్నారు.
Recommended Video
హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంగళవారం మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ నేతల తీరును ఆయన తప్పుబట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతలపై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ పథకం పురుడుపోసుకుందని చెప్పారు.
కల్వకుర్తి ప్రాజెక్టు పరుడు పోసుకున్న సమయంలో కేసీఆర్ కనీసం ఎమ్మెల్యేగానైనా లేరని జైపాల్రెడ్డి ఎద్దేవా చేశారు. దీనిని తమ ఘనతేనని కొందరు మంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చివరి 10శాతం పనులను పూర్తిచేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని కేసీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. ఎవరు కోర్డుకెళ్లినా ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టడం మంచిది కాదన్నారు.
కేసీఆర్లా తాను దిగజారి మాట్లాడలేనని జైపాల్రెడ్డి అన్నారు. కేసీఆర్కు కేంద్ర ప్రభుత్వం అంటే భయ పట్టుకుందని ఆరోపించారు. ఆయన చేసిన తప్పులన్నీ ఈడీ, సీబీఐకి తెలుసు గనుకే భయపడుతున్నారని ఆక్షేపించారు. రేవంత్రెడ్డి సహా ఎవరు పార్టీలో చేరాలన్నా అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
అలాగే ప్రధాని మోడీ నిర్ణయాలు సామాన్యుడికి శాపంలా మారాయని విమర్శించారు. పత్రికలను భయపెట్టే విష సంస్కృతిని మోడీ తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదని జైపాల్రెడ్డి ప్రశ్నించారు.
ధరలు తగ్గాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జీడీపీ నష్టాలను పూడ్చుకునేందుకు పెట్రోల్పై సుంకాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. తాజ్మహల్ విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మతానికి, చారిత్రక వారసత్వ సంపదకు, సంస్కృతికి సంబంధం ఏంటని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు.