జైపాల్ చాణక్యం..హైదరాబాద్ కేంద్ర పాలిత కుట్రకు అడ్డుకట్ట! టీజేఎఫ్, మేథావి వర్గంతో వ్యూహాలు!
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చేసిన పోరాటం, కృషి తెర వెనుకే ఉండిపోయింది. ఉద్యమ సారథిగా ఆయన ఏనాడూ తెర ముందుకు రాలేదు. అయినప్పటికీ- కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకులుగా ఉన్న ఢిల్లీ పెద్దలను ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కొనసాగించిన పోరాటం చిరస్మరణీయం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తెర వెనుక ఉంటూ ఖచ్చితమైన వ్యూహాలు రచించారు. దాన్ని అంతే ఖచ్చితత్వంతో అమలు చేశారు. సొంత పార్టీలోనే ఉంటూ అధిష్ఠానాన్ని ఊపిరి ఆడకుండా చేయగలిగారు. ప్రత్యేక తెలంగాణను ఇచ్చి తీరాల్సిన పరిస్థితిని కల్పించారు జైపాల్ రెడ్డి.
చార్ సౌ సాల్ కా హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా..
తెలంగాణ ఏర్పాటు తప్పదనుకున్న సమయంలో తొలిసారిగా చర్చకు వచ్చింది హైదరాబాద్ అంశం. హైదరాబాద్ను ఏం చేయాలనే విషయం చర్చకు వచ్చింది. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ.. ఈ రెండింటికీ ప్రధాన ఆయువుపట్టు హైదరాబాద్. ఇక్కడి నుంచి వచ్చే ఆదాయమే రాష్ట్ర మనుగడకు ప్రాణవాయువు. అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగా కొనసాగడం వల్ల తలెత్తిన పరిస్థితి అది. విద్య, వైద్యం, ఉపాధి.. ఇలా ఏ ప్రాథమిక అవసరం వచ్చినా ఉత్తరాంధ్ర మొదలుకుని దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వైపే చూపులు సారించేవారు. హైదరాబాద్కు ప్రయాణం కట్టేవారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల మనోభావాలతో ముడిపడిన నగరం అది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన బడా నేతలు భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం ఇదే. అలాంటి భాగ్యనగరాన్ని తెలంగాణకు అప్పగించకూడదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది కూడా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి మొత్తాన్నీ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే ఆలోచన చేసింది. ఆ దిశగా అడుగులు సైతం వేసింది.
తెలంగాణలో అంతర్భాగం..
హైదరాబాద్ రహిత తెలంగాణను ఊహించుకోవడం కష్టం. ఈ స్థాయిలో అభివృద్ధి చెందిన నగరం తెలంగాణలో మరొకటి లేదు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలు ఉన్నప్పటికీ.. హైదరాబాద్తో వాటిని పోల్చలేం. అందుకే- హైదరాబాద్ రహిత తెలంగాణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసిన వెంటనే మరో ఉద్యమానికి బీజం పడింది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) రంగంలోకి దిగింది. సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ దీనికి నేతృత్వం వహించారు. హైదరాబాద్ సహిత తెలంగాణ కోసం టీజేఎఫ్ ప్రతినిధులు మొదటిసారిగా కలుసుకున్నది కూడా జైపాల్ రెడ్డే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రూపకల్పన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డితో ఆయన నివాసంలో టీజేఎఫ్ ప్రతినిధులు క్రాంతి కిరణ్, పల్లె రవి కుమార్, పీవీ శ్రీనివాస్, బలరాం తదితరులు భేటీ అయ్యారు.
జైపాల్ రెడ్డి చొరవ వల్లే..
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలనే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని సైతం తీసుకున్న తరువాత జైపాల్ రెడ్డి చొరవ చూపించారు. దీనికోసం ఆయన హైదరాబాద్ పుట్టుపూర్వోత్తరాలను సైతం పార్టీ అధిష్ఠానానికి వివరించాల్సి వచ్చింది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని వేరు చేయడం ద్వారా మరో ఉద్యమానికి ఆజ్యం పోసినట్టవుతుందని జైపాల్ రెడ్డి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లగలిగారు. ఈ విషయంలో ఆయన విజయం సాధించగలిగారు. దీని ఫలితం- చార్ సౌ సాల్ కా హైదరాబాద్.. తెలంగాణలో కొనసాగగలుగుతోంది. లేదంటే- ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లు, కుతంత్రాలకు లోనై కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించేదే!