ఆ విషయంలో మోడీ, కేసీఆర్లు అన్నదమ్ములే: ఏకిపారేసిన జైపాల్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అబద్దాలు ఆడటంలో ప్రధాని మోదీ, కేసీఆర్ అన్నదమ్ములని ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఇందిరమ్మ రైతు బాటలో భాగంగా ఆయన మాట్లాడారు.
మాట నిలబెట్టుకోని మోడీ..
మోడీ సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో నల్లధనాన్ని బయటకు తీసుకుని వచ్చి జన్ ధన్ ఖాతాల్లో ఒక్కొక్కరి పేరిట 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పారని అన్నారు. అలాగే దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని, సుమారు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్త్తానని కూడా చెప్పారని జైపాల్ రెడ్డి తెలిపారు. అయితే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.
మోడీలాగే కేసీఆర్ గారడీలు
మోడీలాగే కేసీఆర్ కూడా మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఇప్పుడు మాటల మనిషి కాదని, మూటల మనిషని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వైఫల్యమే..
మిషన్ కాకతీయ, మిషన్ భగీరధకు ఉండే నిధులు, రైతు రుణమాఫీకి ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. ఎకరాలు 4 వేల రూపాయలు ఇస్తామని అంటున్నారని, ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 3,500 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడడం కేసీఆర్ వైఫల్యం కాకపోతే ఏంటని జైపాల్ రెడ్డి నిలదీశారు.
నాసీ రకమే..
బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని జైపాల్ రెడ్డి చెప్పారు. కనీసం 500 రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసి పంపణీ జరిపినా తాము మద్దతు పలికేవారమని జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నాసీరకం చీరల్లాగే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సర్కారు కూడా నాసీరకమేనని ఎద్దేవా చేశారు.