కేసీఆర్! నీ కమీషన్ల బాగోతం బయటపెడతా: పట్టపగలే దోపిడంటూ జైపాల్ నిప్పులు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.
కమీషన్ల కోసమే కంపెనీలకు..
తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు సీఎం కేసీఆర్ తనకు నచ్చిన కంపెనీలకే ఇస్తున్నారని, కమీషన్లు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే కట్ట బెడుతున్నారని జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు. దానిలో భాగంగానే మెగా కృష్ణా రెడ్డి కంపెనీలకు 43,436కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అప్పగించారని ఆరోపించారు. నవయుగ కంపెనీకి 17వేల కోట్లు, అదే విధంగా ఒకే కంపెనీకి రూ.60,436కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల నిర్మాణాలను అప్పజెప్పడాన్ని జైపాల్ ప్రశ్నించారు.
ఈస్టిండియా కంపెనీలా..
దేశ చరిత్రలో ఈ విధంగా ఒకే కంపెనీకి ఇంతలా పనులు ఇవ్వలేదని అన్నారు. కంపెనీలకు అధిక లాభం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మూడింతలు పెంచిందని జైపాల్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని.. మెగా కృష్ణా రెడ్డి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పట్టపగలే నిలువుదోపిడీ..
మెగా కృష్ణారెడ్డి కేసీఆర్కు ఏజెంట్ అని, మిగతా వారు సబ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరిట పట్టపగలే నిలువుదోపిడీ చేస్తోందని.. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుందని జైపాల్ రెడ్డి ఆరోపించారు.
లెక్కలు బయటపెడతా..
ఎక్కడ, ఎప్పుడు ఏ కంపెనీలు కేసీఆర్కు ఎంత కమీషన్లు ఇచ్చాయో లెక్కలతో సహా నిరూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతున్నారన్నారు. ఇవన్నీ చేస్తూ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారని కేసీఆర్ ఎలా అంటాడని ప్రశ్నించారు.