బీజేపీ నేతలపై జైపాల్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు, కేసీఆర్ కుటుంబంలోని విభేదాలపై డీకే అరుణ
హైదరాబాద్: బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో పుట్టిన వారంతా రాక్షసులు అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే, ఆ తర్వాత తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. పేదల గురించి ఆలోచించడానికి బీజేపీలో చదువుకున్న వాళ్లు లేరన్నారు. తాము (కాంగ్రెస్) ప్రజాస్వామ్య ప్రియులమని చెప్పారు.
'తెలంగాణ ప్రజలకు శుభవార్త, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేది ఇంకా కొన్ని రోజులే'
అలాగే, తెలంగాణ సీఎం కేసీఆర్ విసిరిన ముందస్తు సవాల్ పైన కూడా ఆయన స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని చెప్పారు. కేసీఆర్ ఏ స్కీమ్ పెట్టినా విఫలమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమేనని, ఎన్నికల సమయంలో ఒక్కటవుతామని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే ఎన్నికల సమయంలో కేసీఆర్కు కష్టమని చెప్పారు. మాకు ఎప్పుడు కష్టాలు ఉన్నా ఎన్నికల సమయంలో ఇబ్బంది ఉండదని చెప్పారు.
తెరాసలో విభేదాలు లేవా: డీకే అరుణ
ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ది మేకపోతు గాంభీర్యం అని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. తాము ఎన్నికలకు సిద్ధమన్నారు. పార్టీలోకి ఉద్యమ నాయకులను కాకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలోని విభేదాలపై స్పందిస్తూ.. కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని, అలాగే అన్ని పార్టీల్లో ఉన్నాయని, తమ పార్టీలోను అంతే అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పెండింగుకు జూపల్లి కృష్ణా రావు కారణం అన్నారు. గద్వాలకు సీఎం రాకను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.