రాష్ట్ర విభజన-8వ చాప్టర్లో ఏముందంటే..: గుట్టువిప్పిన జైరాం
న్యూఢిల్లీ: విభజన పైన అధ్యయనం చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో 8వ చాప్టర్లో ఉన్న రహస్యం ఏమిటనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ వెల్లడించారు. ఈ చాప్టర్లో ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేయని విషయం తెలిసిందే.
ఈ చాప్టర్ను బహిరంగపరచాలని కోర్టుకు కూడా వెళ్లిన వారు ఉన్నారు. విభజన జరిగిన రెండేళ్ల తర్వాత జైరామ్ రమేష్ ఆ చాప్టర్ గుట్టును విప్పారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిది చాప్టర్లతో నివేదిక ఇచ్చింది. ఏడు చాప్టర్లను బహిరంగపరిచినా, ఎనిమిదో చాప్టర్ వెల్లడి కాలేదు. దీని కోసం ఆందోళనలు కూడా జరిగాయి.
విభజన జరిగిన రెండేళ్ల తర్వాత జైరాం చాప్టర్ గురించిన రహస్యాన్ని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడితే అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందులో పేర్కొన్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం నక్సల్స్ను బాగా అణచివేసిందని, తెలంగాణ ఏర్పడితే మల్లీ నక్సల్స్ చర్యలు పెరుగుతాయని, నక్సల్స్ ప్రభావం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ఉంటుందని పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయని జైరాం చెప్పారు.
అంతర్గత భద్రతా కారణాల దృష్ట్యా దీనిని రహస్యంగా ఉంచామని చెప్పారు. వాస్తవానికి 2012 డిసెంబర్ 28నే విభజన జరపాలని సీడబ్ల్యూసీ సూత్రప్రాయంగా నిర్ణయించటిందని, 2013 జూలై 30న పునరుద్ఘాటిస్తూ తీర్మానం చేశారని వివరించారు.
తెలంగాణను ఏర్పాటు చేస్తే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే తెరాసను కేసీఆర్ తమ పార్టీలో విలీనం చేస్తారని కాంగ్రెస్ నేతలు ఆశించారని, ఇదే అభిప్రాయంతో తాము ముందుకెళ్లామని, విభజన వల్లే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని ఒప్పించారన్నారు.