కెసిఆర్ వందేళ్లు పోరాడినా తెలంగాణ వచ్చేది కాదు: జానారెడ్డి, రోడ్డునపడేశారన్న పొన్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంతో బంగారు తెలంగాణ సాధ్యం కాదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. నిజామాబాద్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం చంద్రశేఖర్ రావు మరో వందేళ్లు పోరాడినా తెలంగాణ వచ్చేది కాదన్నారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించినందునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని జానారెడ్డి తెలిపారు. ప్రజల్లో చైతన్యం దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని జానారెడ్డి స్పష్టం చేశారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్పై సీఎం కేసీఆర్ను అసెంబ్లీలో నిలదీస్తామని జానారెడ్డి చెప్పారు. ప్రాజెక్టు రీ డిజైన్ వల్ల 3లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం లేదని, ఈ విషయంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని జానారెడ్డి పేర్కొన్నారు.
చెప్పేదొకటి, చేసేదొకటి: పొన్నం
తెలంగాణ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. 60వేల ఇళ్ల నిర్మాణాలకు జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కోర్టుకు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నదొకటని ఆరోపించారు. చినముల్కల్నూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న కెసిఆర్.. ఆ గ్రామ ప్రజలను రోడ్డున పడేశారన్నారు. గృహ నిర్మాణం పేరుతో ఇళ్లు కూలగొట్టి ఐదు నెలలైనా పనులు ప్రారంభించలేదని పొన్నం మండిపడ్డారు.