టీపీసీసీ చీఫ్ గా జానా రెడ్డి ? తెలంగాణా కాంగ్రెస్ లో అసలేం జరుగుతుంది
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం తర్వాత హుజూర్నగర్ లో టీపిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతి ఓటమిపాలైన నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తిన బాట పట్టారు. టీపిసిసి చీఫ్ గా అవకాశం కోసం సీనియర్లు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
రేవంత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న సీనియర్లు
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టీ పిసిసి చీఫ్ ఎవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ గా ఎవరున్నా పరవాలేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం వద్దు అంటూ చాలా మంది సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందులో భాగంగా ఒకప్పుడు విభేదాలతో ఉన్న నేతలు సైతం, ఇప్పుడు అందరూ ఒక తాటి మీదికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ కు టీపీసీసీచీఫ్ గా అవకాశం ఇస్తే ఊరుకోమన్న నేతలు
ఉత్తమ్ టిపిసిసి చీప్ గా రాజీనామా చేస్తే నెక్ట్స్ తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే నాయకుడు ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కారణమౌతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పదవి కట్టబెట్టడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే బాహాటంగా పలుమార్లు రేవంత్ కు అవకాశం ఇస్తే ఊరుకోమని వీహెచ్ వంటి నేతలు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్లు ఆధిపత్యాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదని సమాచారం.
రేవంత్ వద్దు ...సీనియర్ల ఏకాభిప్రాయం
పార్టీలో సీనియర్ గా ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పని చేసిన నాయకులు ఉండగా తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన నేత, ఏకులా వచ్చి మేకులా తయారైన రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు సీనియర్ నాయకులు. ఇక తాజా పరిణామాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ పిసిసి చీఫ్ కు గుడ్ బై చెప్పడం ఖాయమని అంతా అంటున్నారు. మరి ఆ స్థానంలో రేవంత్ కు ఆ అవకాశం ఇవ్వకూడదన్న బలమైన కోరిక టీపీసీసీ పెద్దల్లో ఉన్న నేపథ్యంలో అందరూ కలిసి ఏకాభిప్రాయం మీద పావులు కదిపాలని నిర్ణయించుకున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలోనే ఒక్కటైన సీనియర్లు
ముఖ్యంగా కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల చేతుల్లోనే కాంగ్రెస్ పగ్గాలు ఉండాలని ఆ జిల్లా సీనియర్లు అంతా పట్టుదలగా ఉన్నారని సమాచారం.అంతా కలిసి రేవంత్ కు అవకాశం రాకుండా ఉండడానికి విఫల యత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారు ఆధిపత్య పోరులో నువ్వా నేనా అన్నట్టు ఉన్న నేతలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి రావడంతో అంతా ఒకటయ్యారు. మొన్నటి హుజూర్ నగర్ అభ్యర్థి విషయంలోనూ ఉత్తమ్ ప్రతిపాదించిన పద్మావతికే ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్లు అయిన జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్ ,పొన్నం, భట్టి, దామోదర రాజనర్సింహ తో పాటుఇతర సీనియర్లు మద్దతు తెలిపారు. దీంతో రేవంత్ మాట నెగ్గలేదు.
జానారెడ్డి పేరు ప్రతిపాదన .. ఏం జరుగుతుందో ?
ఇప్పుడు కూడా టిపిసిసి చీఫ్ రేసులో రేవంత్ ఎంతగా ప్రయత్నం చేస్తున్నా మిగిలిన సీనియర్ నాయకులు అందరూ కలిసి రేవంత్ ఆశలపై నీళ్లు చల్లేందుకు యత్నం చేస్తున్నారు . అందరూ కలిసి ప్రస్తుతం టి పి సి సి ప్రెసిడెంట్ గా జానా రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తుంది. టిడిపి నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల పైన పెత్తనం చెలాయించకుండా రేవంత్ రెడ్డి కి చెక్ పెట్టడానికే సీనియర్లంతా ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా చర్చసాగుతోంది. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ లో టీ పిసిసి అధ్యక్ష ఎంపిక విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చెక్ పడేది ఎప్పుడో తెలియాల్సి ఉంది.