2019లో కేసీఆర్ను ఓడించండి: జానారెడ్డి, కోదండరాం ఆగ్రహం
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తెరాస పాలనను తుదముట్టించాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి శుక్రవారం నాడు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.
నిధులు, నీళ్లు, నియామకాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవడం తథ్యమన్నారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఖాయమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనను ఓడించాలని చూసినా యూత్ కాంగ్రెస్ అండతో తాను ఎమ్మెల్సీగా గెలిచానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసాలను యూత్ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ తన ఇంటిలో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
యువతకు క్షోభ మంచిది కాదు: కోదండరాం
తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కొత్త రాష్ట్రంలో యువత క్షోభకు గురికావడం మంచిది కాదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే రాష్ట్రం సాధించుకున్నామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు.