ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టం కానీ: హరీష్ది తప్పన్న జానా
హైదరాబాద్: మార్కెట్ ధర కంటే తక్కువకు మల్లన్న సాగర్ భూములు కొనుగోలు చేయడం సరికాదని, రైతులకు న్యాయం చేస్తే తాము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టమని, బాధిత రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి సోమవారం అన్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తే రైతులు నష్టపోతారన్నారు.
దానిపై జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తే రైతులకు నష్టం అనే వాదన సరికాదన్నారు. భూములను మదింపు చేసిన తర్వాత పరిహారం ఇస్తే రైతులకు నాలుగింతల ప్రయోజనం కలుగుతుందన్నారు.
ప్రాజెక్టులు అడ్డుకునేందుకే: హరీష్
కాంగ్రెస్, టిడిపిలు మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని మంత్రి హరీష్ రావు సోమవారం మరోసారి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతీరోజు కుట్రలు చేస్తూనే ఉన్నారన్నారు.
ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. 56 ఏళ్ల నుంచి మెదక్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు, కాలువ కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్, టిడిపి నాయకులు ఆనాడు తెలంగాణకు అడ్డుపడ్డారని, ఇవాళ మళ్లీ ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణను ఎలాగైతే పట్టుబట్టి సాధించుకున్నామో, మల్లన్న సాగర్ అలాగే నిర్మిస్తామన్నారు.