ఇలాంటి వ్యక్తులు సమాజానికి చేటు: కత్తి మహేశ్పై జానా రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేశ్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ సామరస్యానికి భంగం కలిగించే ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
Recommended Video
కత్తి మహేశ్ అరెస్ట్: శ్రీరాముడిపై వ్యాఖ్యలే కారణం
బుధవారం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదని అన్నారు.
ఇలాంటి విషయాల్లో మీడియా ప్రతినిధులు సంయమనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదని జానా రెడ్డి సూచించారు. అలాంటప్పుడే రాజకీయ నాయకులు.. ఇది సరికాదని తెలుసుకుంటారని చెప్పారు. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని స్పష్టం చేశారు.
రేషన్ డీలర్ల సమస్య విషయంలో ప్రభుత్వం దిగిరావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రైతు బంధు పథకం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడంతో వ్యవసాయం చేసేవారికి నష్టం జరుగుతుందని అన్నారు. వ్యవసాయం చేసే వారికి సాయం అందడం లేదని అన్నారు. పట్టాదారుల నుంచి సాగుదార్లకు సాయం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.