వినాశకాలే విపరీత బుద్ధి: కెసిఆర్పై జానా, విఫలమని..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కెసిఆర్ వ్యవహార శైలి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం ఉందనే అహంకారంతోనే సిఎం, తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పార్టీ ఫిరాయించిన టిఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటువేయాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి పిటిషన్ ఇచ్చినట్లు చెప్పారు. గెలిచిన పార్టీ, పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరడం అనైతికం, చట్ట విరుద్ధమని జానారెడ్డి అన్నారు. స్పీకర్ రాజ్యాంగపరంగా వ్యవహరించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నట్లు జానారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే చిన్నారెడ్డికి పరామర్శ
మహబూబ్నగర్ జిల్లా వనపర్తిని జిల్లా చేయాలని కోరుతూ దీక్ష చేపట్టి పోలీసుల ఆధ్వర్యంలో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే చిన్నారెడ్డిని బుధవారం పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, కృష్ణారెడ్డి తదితరులు చిన్నారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వనపర్తిని జిల్లాగా ప్రకటించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా వారు విమర్శించారు.