కన్నతల్లిXమంత్రసాని: జానా కోపం, నాకు ఇంగ్లీష్ రాదు.. ఆవేశం ఎక్కువ: రసమయి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో రైతు ఆత్మహత్యల పైన చర్చ సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. 'కన్నతల్లి, మంత్రసాని' అన్న ఆయన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ... అసెంబ్లీ ద్వారా రైతులకు భరోసా కావాలన్నారు. వారిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయాలన్నారు. నాకు పాటలు పాడటం తప్ప మరో భాష రాదు. (పాట రూపంలో చెప్పగలను కానీ, మరో విధంగా చెప్పలేనని అభిప్రాయం) రైతుల పట్ల కెసిఆర్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ 47వేల చెరువులకు మరమ్మతులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఏడువేల చెరువులు మరమ్మతు చేశామన్నారు. పదివేల కోట్ల రూపాయల రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసిందన్నారు. రైతుల కోసం పాదయాత్ర చేసిన ఘనత కెసిఆర్దే అన్నారు.
రైతులకు భరోసా ఇవ్వాల్సిన వారు.. రెచ్చగొట్టేలా చేయడం విడ్డూరమని విపక్షాలను ఉధ్దేశించి అన్నారు. గతంలో రైతులు చనిపోతే ఎవరైనా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారా అని నిలదీశారు.
కానీ మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్లి ఆ ఇళ్లను దత్తత తీసుకుంటున్నారన్నారు. నేడు హరితహారం పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వం చెట్లు నాటుతోందని, రేపటి పచ్చదనానికి ఇది పునాది అన్నారు.
మంత్రసాని, కన్నతల్లి పాత్రపై జానా ఆగ్రహం
తెలంగాణ విషయంలో తమ పార్టీది (టీఅర్ఎస్) కన్నతల్లి పాత్ర అయితే, మీది (కాంగ్రెస్)ది మంత్రసాని పాత్ర అన్నారు. దీనిపై జానా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమది మంత్రసాని పాత్ర అన్న సభ్యుడు తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని జానా రెడ్డి డిమాండ్ చేశారు. అర్థంపర్థం లేని మాటలు సరికాదన్నారు. 55 ఏళ్లుగా భారత దేశాన్ని కన్నతల్లిలా అభివృద్ధి చేస్తోంది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీదే కన్నతల్లి పాత్ర అని, అయినా అలా అనమని మీకు చెప్పలేమని, కానీ మాది మంత్రసాని పాత్ర అనడం మాత్రం సరికాదన్నారు.
మేం (కాంగ్రెస్) తెలంగాణ ఇచ్చి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామన్నారు. అసలు మీది మంత్రసాని పాత్ర అయితే, మాది కన్నతల్లి పాత్ర అన్నారు. తెలంగాణ బిడ్డను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తమ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రసంగం కొనసాగనివ్వమన్నారు.
దీనికి... రసమయి మాట్లాడుతూ... నేను జానా రెడ్డి వంటి అనుభవజ్ఞుడిని కాదని, కాబట్టి తనకు ఆవేశం ఎక్కువ అని చెప్పారు.
కాంగ్రెస్ సభ్యులు స్పందిస్తూ... మంత్రసాని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.
దానికి రసమయి.. నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. అయితే, కాంగ్రెస్ సభ్యులు మరోసారి డిమాండ్ చేయడంతో... తనకు ఇంగ్లీష్ రాదని, విత్ డ్రాను ఏమంటారో మీరే చెప్పాలని, నేను స్పష్టంగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పానన్నారు.
మంత్రి హరీష్ రావు కల్పించుకొని... కొత్త సభ్యుడు మాట్లాడుతుంటే సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ కలుగజేసుకొని.. ఉపసంహరించుకుంటున్నానని సభ్యుడు చెప్పారని తెలిపారు. అనంతరం రసమయి మాట్లాడుతూ... మేం పిల్లలమని, మేం కొత్తగా వచ్చామని, మాకు మంచిగా చెప్పాలని, మీలా చెప్పాలని స్పీకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం సభ పది నిమిషాలు వాయిదా పడింది.