ప్రజలు మమ్మల్ని నమ్మలేదు, అవసరమైతే టిడిపితో పొత్తు: జానా, షబ్బీర్ మరోలా..
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తును కొట్టిపారేయలేమని చెప్పారు.
ఓటమి ద్వారా ఆత్మస్త్థెర్యాన్ని కోల్పోవడం మంచిదికాదన్నారు. ప్రజస్వామ్యానికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. గెలుపునకు విర్రవీగటం, ఓటమికి కుంగిపోవటం కాంగ్రెస్ సిద్ధాంతం కాదన్నారు. భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి కాంగ్రెస్ నాందిపలికిందన్నారు.
కెసిఆర్ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు
తెలంగాణ సీఎం కెసిఆర్ పదేపదే నన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు మమ్మల్ని నమ్మలేదని చెప్పారు.
టిఆర్ఎస్ ద్వారా మేలు జరుగుతుందని ప్రజలు నమ్మారన్నారు. ప్రజలు విశ్వసించేలా మరింత ముందుకు వెళ్తామని జానా రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికల్లో పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామన్నారు.
టిడిపితో పొత్తుపై...
తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది సందర్భాన్ని భట్టి నిర్ణయించాలన్నారు. పొత్తులు అసాధ్యమేమీ కాదని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలను నిరంతరం గుర్తు చేస్తామని చెప్పారు. సందర్భాన్ని బట్టి పొత్తులుంటాయన్నారు.
మంచి పనులకు సహకరిస్తాం: షబ్బీర్ అలీ
ప్రభుత్వం చేసే మంచి పనులకు తాము సహకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సభలో సమస్యల పైన ప్రస్తావిస్తాం, ప్రశ్నిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయిస్తే మాత్రం ఏమవుతుందో చెప్పలేమన్నారు.