నేనే సీఎం క్యాండిడేట్: పార్టీ మార్పుపై జానారెడ్డి, మాణిక్యం ఠాకూర్ చర్చలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి, ఆయన కుమారుడు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా సీట్లను కైవసం చేసుకున్న బీజేపీవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు విజయశాంతి, గూడూరు నారాయణ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
జానారెడ్డిపై దృష్టిపెట్టిన బీజేపీ, టీఆర్ఎస్..
ఈ నేపథ్యంలో జానారెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో రాబోయే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని జానా రెడ్డికి బీజేపీ నేతలు, మరోవైపు టీఆర్ఎస్ నేతలు వలవేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు పార్టీలు కూడా ఫోన్ల ద్వారా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, జానా రెడ్డి హైదరాబాద్ నగరంలోకి రావడంతో ఈ మంతనాలు మరింత పెరిగినట్లు సమాచారం. అయితే, బీజేపీ నేతలకు జానా రెడ్డి పలు షరతులు కూడా పెట్టినట్లు తెలిసింది.
జానారెడ్డితో మాణిక్యం ఠాకూర్ చర్చలు
ఇది ఇలావుంటే, జానా రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆయనకు ఫోన్ చేశారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించారు. ఈ సందర్భంగా జానా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేనే సీఎం క్యాండిడేట్.. నేనెలా పార్టీ మారతా: జానారెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని జానా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... తానే సీఎం క్యాండిడెటన్న జానా రెడ్డి.. తానెందుకు పార్టీ మారతానని ఎదురు ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ చర్చలు జరిపారు. జానా రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని వారు స్పష్టం చేశారు. ఇది ఇలావుండగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా, ఇప్పుడు కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుపుతున్నారు మాణికం ఠాకూర్.