ఇంత మొండిగానా?: కేసీఆర్ను ఏకిపారేసిన జానా, ఉత్తమ్, షబ్బీర్
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామనే అరెస్టులు చేయిస్తున్నారని సీఎం కేసీఆర్పై జానా మండిపడ్డారు. చట్ట వ్యతిరేక పనులపై కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే రూ.4వేల పెట్టుబడిని ఇప్పుడే రైతులకు ఇవ్వాలని అన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ అని నాలుగు దశల్లో చెల్లించారని అన్నారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో రైతులు పండించే పంటలకు మద్దతు ధర రావడం లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను గురించి అడుగుదామంటే తమకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ వస్తే ప్రజాస్వామ్యం మరింత వర్థిల్లుతుందని అనుకుంటే దానికి భిన్నంగా ఉందని అన్నారు.
ప్రభుత్వ తీరు నచ్చకపోతే నిరసనలు చేసుకునే అవకాశం ఇవ్వాలని, దానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఉత్తమ్ మండిపడ్డారు. రైతుల నుంచి హమాలీ ఛార్జీలు వసూలు చేయకూడదని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారించాలని అన్నారు. రైతుల సమస్యలపై అత్యవసరంగా చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చామని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఈ ప్రభుత్వంలో చలనం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని అన్నారు. మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. సీఎం అప్రజాస్వామికంగా వ్వవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.