ఎమ్మెల్యేల షాక్: జానా వేదాంతం, సిగ్గుందా.. రెచ్చిన షబ్బీర్ అలీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి వేదాంతం మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, ఫిరాయింపులకు పాల్పడుతున్న వారికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.
ఆయన మంగళవారం నాడు సీఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార టిఆర్ఎస్కు కాలం గుణపాఠం చెబుతుందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్లు తెరాసలో చేరడం బాధాకరమన్నారు.
నేతలను ప్రలోభాలకు గురి చేసి తెరాసలోకి తీసుకు వెళ్తున్నారని ఆరోపించారు. విపక్షాలను బలహీనపర్చడం అధికార పార్టీకి తగదు అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఇలాంటి వాటికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ మారిన వారి పైన ఫిర్యాదు చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చడానికి రాష్ట్ర పాలక పక్షం విపరీత ధోరణులకు పాల్పడుతుంతని, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. భవిష్యత్తులో తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. కొత్త రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం సమర్థమంతంగా పని చెయ్యాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసే విధంగా కొత్త చట్టం తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్కు సిగ్గు, శరం ఉంటే ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడరని షబ్బీర్ అలీ ఘాటుగా మాట్లాడారు.