పువ్వాడకు మైక్, గందరగోళం: అధికారంలో కూర్చోం.. జానాపై కేటీఆర్ సీరియస్
పువ్వాడ అజయ్ కుమార్కు మాట్లాడేందుకు స్పీకర్ మధుసూదనా చారి సోమవారం నాడు మైక్ ఇవ్వడం తెలంగాణ శాసన సభలో గందరగోళానికి దారి తీసింది.
హైదరాబాద్: పువ్వాడ అజయ్ కుమార్కు మాట్లాడేందుకు స్పీకర్ మధుసూదనా చారి సోమవారం నాడు మైక్ ఇవ్వడం తెలంగాణ శాసన సభలో గందరగోళానికి దారి తీసింది. ఆయనకు మైక్ ఎందుకు ఇచ్చారు, ఏ పార్టీ తరఫున ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు.
పువ్వాడ అజయ్ కుమార్కు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశమిచ్చారు. దీనిని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. ఆయనకు మైక్ ఇవ్వడంపై జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పువ్వాడ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారో చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
బీజేపీ సభ్యులు తమ పరపతి ఉపయోగించాలి: అది నిజమేనని ఒప్పుకున్న కేటీఆర్
ఓ సభ్యుడిగా తనకు అవకాశమివ్వాలని కోరానని, తన హక్కును కాలరాయవద్దని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. జానారెడ్డి దయాదాక్షిణ్యాలపైన తాము ఇక్కడ కూర్చోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
జానారెడ్డి వర్సెస్ కేటీఆర్
పువ్వాడకు మైక్ ఇవ్వడంపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం మాట్లాడిన తర్వాతనే వేరే వాళ్లకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని జానా అన్నారు. సభ్యులను స్పీకర్ కంట్రోల్ చేయాలన్నారు. ఇతర పక్షాల సలహాలు తీసుకోవద్దని, ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామన్నారు.
సభలో మాట్లాడుతుంటే మంత్రి కేటీఆర్ పదేపదే అడ్డుతగులుతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభ నడపడానికే లేక రెచ్చగొట్టడానికా లేక అధికార అహంకార ప్రదర్శన చాటి చెప్పడానికా అని వ్యాఖ్యానించారు. గత పద్ధతులకు స్వస్తి చెప్పి ముందుకు సాగాలని ప్రజలు కోరుకున్నారన్నారు. విపక్షాలు మాట్లాడుతుంటే పదేపదే అడ్డు తగలవద్దన్నారు.
జానారెడ్డి తీరుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాము జానా దయాదాక్షిణ్యాల పైన ఇక్కడ (అధికార పక్షంలో) కూర్చోలేదన్నారు. ప్రజలు వద్దంటే తాము ఇక్కడ కూర్చోమని చెప్పారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. గతంలో ఏం జరిగింతో చెబుతున్నానన్నారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అన్నారు.
తన మాటలు వినాల్సిన అవసరం లేదని జానా రెడ్డి చెప్పడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల పైన మంత్రిని కాలేదన్నారు. కాంగ్రెస్ సభ్యులకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవన్నారు. తాను జానాను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉదాహరణలు చెప్పానన్నారు. తనను ప్రజలు ఎన్నుకున్నారన్నారు.
మైక్ ఎవరికైనా ఇవ్వవచ్చునని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అయితే, పువ్వాడకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ బ్లాక్లో ఉన్న వారికి ఇవ్వాలన్నారు. పువ్వాడకు ఇవ్వడం ద్వారా పార్టీ ఫిరాయింపులను మీరు ప్రోత్సహించినట్లు కాదా అని ప్రశ్నించారు.