మహాకూటమిలో జనసమితి భవితవ్యం..! కాంగ్రెస్ తో రేపే భేటీ..! కీలక పదవి కోరనున్న కోదండరాం..!
హైదరాబాద్: తెలంగాణ మమాకూటమి కీలక దశకు చేరుకుంది. రేపు జనసమితి కోదండ రాం తో టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదిత మహాకూటమిలో చేరేందుకు తెలంగాణ జన సమితి సుముఖత వ్యక్తం చేసింది. కండీషన్స్ అప్లైడ్ అన్నట్టు, తమ చేరిక కోసం కీలక మెలిక పెట్టింది. మహాకూటమి కోసం రూపొందించే కనీస ఉమ్మడి కార్యక్రమం ఛైర్మన్ గా కోదండ రాంను నియమించాలని కోరుతోంది. అంటే కూటమి జుట్టును తమ చేతిలో పెట్టుకోవాలని టీజేఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చే సీట్ల విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించినా గానీ, కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఛైర్మన్ పదవిని మాత్రం కచ్చితంగా డిమాండ్ చేయాలని టీజేఎస్ భావిస్తోంది. ఈ పదవి కోరడమంటేనే దాదాపు ముఖ్యమంత్రి పదవి కోరినట్టేనన్న భావన వ్యక్తమవుతోంది.
కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఛైర్మన్ పదవి కోరుతున్న కోదండరాం..! కూటమిలో ఈ పదవే కీలకం..!
మహాకూటమి గెలిచి అధికారంలోకి వస్తే కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఛైర్మన్ పదవి చాలా కీలకంగా మారుతుంది. దాదాపు ముఖ్యమంత్రితో సమాన స్థాయి పదవిగా చలామణిలో ఉండే అవకాశం ఉంటుంది. మహాకూటమి మ్యానిఫెస్టో మొత్తానికి ఆయనే ఛైర్మన్ గా ఉంటారు. మ్యానిఫెస్టో అమలు బాధ్యత ముఖ్యమంత్రిదే కనుక, ఈ కమిటీ ఛైర్మన్ అంటే ఆల్మోస్ట్ సీఎం పదవితో సమాన హోదాను కోరుకుంటున్నట్టే భావించాల్సి ఉంటుంది. కోదండ రాం ప్రతిపాదిస్తోన్న ఈ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అనే అంశం పట్ల మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
చర్చలు రేపే..!జనసమితి భవితవ్యం తేల్చనున్న కాంగ్రెస్..!!
ఇదిలా ఉండగా జనసమితి ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తే, కూటమిలో కోదండ రాం పాత్ర చాలా కీలకంగా మారుతుంది. కోదండ రాంకు పబ్లిక్ లో ఇమేజ్ ఉంది కనుక, ఆ మేరకు కూటమికి విశ్వసనీయత వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వచ్చే ప్రభుత్వంలో కోదండరాం అత్యంత కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉంటుంది. కూటమి అధికారంలోకి వస్తేనే ఈ పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వస్తే సీన్ మరోలా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాం ను కాంగ్రెస్ గౌరవిస్తుందా? కూటమి అస్థిత్వంలో ఉండే అవకాశం ఉంటుందా? తమ పవర్ లో కోదండ రాంకు కోటా ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.
గులాబీ అసమ్మతులంతా కాంగ్రెస్ వైపు..! అందరికి న్యాయం చేస్తామంటున్న టీపీసీసీ..!!
ఇదిలా ఉంటే తెలంగాణలో అసమ్మతి నేతలు కొత్త గూళ్లు వెతుక్కుంటున్నారు. టీఆర్ఎస్ లో టికెట్లు దక్కని నేతలు హస్తం పార్టీకి జై కొడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చిన సీట్ల విషయంలో సైతం మాటతప్పడం పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మోసం...దగా అంటూ మండిపడుతున్నారు. పక్క పార్టీలతో మాట్లాడుకుని జంప్ చేయడానికి ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. ఈ నెల 20 తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున వలసలకు రంగం సిద్ధమైంది. రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ తో పాటు మరికొంత మంది అసమ్మతులు ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ చేరబోతున్నారు.
గులాబీ పార్టీని గద్దె దించడమే లక్ష్యం..! కలిసొచ్చే పార్టీలతో పోటీ ఇస్తామంటున్న కూటమి..!!
ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, క్యూలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, నందీశ్వర్ గౌడ్, ఆకుల రాజేందర్ లు ఉన్నారు. వీళ్లు కూడా ఒకటి రెండు విషయాల పై క్లారిటీ రాగానే హస్తం గూటికి చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు ఆ స్థాయిలో వలసలు లేవు. గులాబీ పార్టీ అల్రేడీ టికెట్లు ఖరారు చేసేయడంతో, ఇక అక్కడ టికెట్ కోసం వెళ్లేవారు ఎవరూ లేక పోగా ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది.