ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ దక్కినా, పోటీ చేయలేకపోయారు: మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించిన జనసేన
హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు మరో ఇరవై మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రచారం చేసుకోమని వారికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
చదవండి: తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన..! అభ్యర్థుల బయోడేటాల పరిశీలనలో గబ్బర్ సింగ్..!!
అదిలాబాద్ (రమేష్ రాథోడ్), మహబూబాబాద్ (బలరాం నాయక్), పెద్దపల్లి (చంద్రశేఖర్), కరీంనగర్ (పొన్నం ప్రభాకర్), మల్కాజిగిరి (రేవంత్ రెడ్డి), జహీరాబాద్ (మదన్ మోహన్), చేవెళ్ల (కొండా విశ్వేశ్వర రెడ్డి), మెదక్ (గాలి వినోద్ కుమార్) పేర్లను ఖరారు చేశారు. టీఆర్ఎస్ కూడా నిజామాబాద్ (కవిత), అదిలాబాద్ (నగేష్), భువనగిరి (నర్సయ్య గౌడ్), మెదక్ (కొత్త ప్రభాకర్ రెడ్డి), కరీంనగర్ (వినోద్ కుమార్) పేర్లను ఖరారు చేశారు.
చదవండి: 'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్కేనా?
జనసేన పార్టీ నుంచి మల్కాజిగిరి అభ్యర్థి ఇతనే
తెలంగాణ బరిలోకి దిగుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కూడా ఓ అభ్యర్థిని ప్రకటించారు. మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించారు. జనసేన పార్టీ తరఫున బి మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మహేందర్ రెడ్డికి టిక్కెట్ ఇస్తున్నట్లు శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడారు.
ప్రజారాజ్యం పార్టీ నుంచి టిక్కెట్ ఇచ్చినా చివరి నిమిషంలో...
సమాజ సేవ చేయాలన్న తపనతో మహేందర్ రెడ్డి కోట్లాది రూపాయల వ్యాపారాలను వదులుకుని వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. గతంలో మెదక్ నుంచి పోటీ చేయడానికి ప్రజారాజ్యం తరఫున టికెట్ ఇచ్చినా చివరి క్షణంలో ట్రాఫిక్లో చిక్కుకుని నామినేషన్ వేయలేక పోయారని తెలిపారు. ఇప్పుడు జనసేన నుంచి మల్కాజిగిరి టికెట్ ఇస్తున్నామన్నారు. జనసేన తరఫున టిక్కెట్ ప్రకటించిన తొలి అభ్యర్థి ఆయనేనని చెప్పారు.
బయోడేటా సమర్పించాలి
తెలంగాణలో లోకసభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీ వేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన సిద్ధాంతాలపై నమ్మకం ఉన్నవారు టికెట్ల కోసం బయోడేటాను ఈ కమిటీకి అందజేయాలన్నారు. మాదాపూర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పది గంటల నుంచి బయేడేటాలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటికే కొందరు తమ తమ బయోడేటాలు ఇచ్చారని చెప్పారు.