175 స్థానాల్లో పోటీ: పవన్, జనసేన వ్యూహకర్తగా దేవ్ నియామకం, 'అధికారంలోకి వస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పోటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో పోటీపై ప్రణాళికను ఆగస్టు నెలలో విడుదల చేస్తామని వెల్లడించారు.
బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికాబద్దంగా అడుగులు వేద్దామని పవన్ అన్నారు. పార్టీకి అనుభవం లేకపోయినప్పటికీ ప్రతి కార్యకర్తకు రెండు ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉందన్నారు.
తాను త్వరలో ప్రజల ముందుకు వస్తానని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్ను నియమించారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పవన్-కేసీఆర్కు చంద్రబాబు తోడు: కర్నాటకలో బీజేపీ-కాంగ్రెస్కు భారీ షాక్
పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతామని పవన్ పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రణాళికతో అడుగులు వేద్దామని పేర్కొన్నారు. సగటు మనిషి, అణగారిన వర్గాల గొంతు మన జనసేన అన్నారు. పార్టీ చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా దేవ్ను నియమించినట్లు చెప్పారు. దేవ్కు 1200 మంది నాటి సీపీఎఫ్ కార్యకర్తలు సహకరిస్తారని పేర్కొన్నారు.
అధికారంలోకి వస్తాం: దేవ్
కార్యకర్తలను ఉద్దేశించి దేవ్ మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసిన అనుభవం తనకు ఉందని, ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నానని, గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ ని, ఎన్నికల సమయంలో వచ్చి ముఖం చూపించి పోయే సీజనల్ నాయకుడు కాదని, పవన్కు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంసాల పట్ల అవగాహన ఉందన్నారు.
జనసేన పార్టీకి బలమైన భావజాలాన్ని, సిద్ధాంతాలను రూపొందించారన్నారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు. ఇందుకు బూత్ స్థాయి నుంచి పకడ్బంది ప్రణాళికలు వేసుకోవాలన్నారు. నా టీంకు మీ అందరి సహకారం అవసరమని, రాజకీయంగా ఉత్తేజితులై పవన్ ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలనే అంశాలతో పాటు ఎన్నికల వరకు అనుసరించే వ్యూహాలను మీతో ఎప్పటికి అప్పుడు పంచుకుంటానని దేవ్ చెప్పారు. జనసేన ప్రజలతో మమేకమయ్యే పార్టీ అని, అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పని చేస్తామన్నారు.