జనగాం ఎన్కౌంటర్: 5గురు మిలిటెంట్లు ఎక్కడివారు?
హైదరాబాద్: వరంగల్ జిల్లా జనగామ ఎన్కౌంటర్లో మరణించిన ఐదుగురు మిలిటెంట్లు కూడా నేర చరిత్ర ఉన్నవారే. వికారుద్దీన్ గురించి చెప్పనే అక్కర లేదు. అతని చరిత్ర ఇప్పటికే అందరికీ అర్థమైంది. మిగతా నలుగురు ఎక్కడివారు, వారిపై ఉన్న కేసులేమిటో చూద్దాం...
-2010లో వికార్ అహ్మద్ నాయకత్వంలో అమ్జద్, మహ్మద్ జకీర్, మహ్మద్ అనీఫ్, మహ్మద్ రియాజ్ ఖాన్, మహ్మద్ అబ్దుల్ సయ్యిద్లు దాడులకు కుట్రపన్నారు. తెహరిక్ ఘల్బ-ఇ-ఇస్లామ్ (టీజీఐ) వ్యవస్థను స్థాపించిన ఫసియుద్దీన్ను ఆదర్శంగా తీసుకొని సొంత సంస్థను స్థాపించాలని పథకం వేశారు. షాలిబండ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ యూ రమేశ్పై కాల్పులు జరిపి హత్య చేశారు. దీనిపై హుస్సేనీ ఆలం ఠాణాలో (క్రైం నం.87/2010) కేసు నమోదయ్యింది.
సయ్యద్ అమ్జద్ అలియాస్ ,సులేమాన్ అలియాస్ సల్మాన్
-సులేమాన్గా అందరికీ తెలిసిన ఇతను వికారుద్దీన్కు అనుంగ అనుచరుడు, దగ్గరి బంధువు కూడా. వికారుద్దీన్ నేరాలన్నింటిలో ఇతని పాత్ర ఉంది. వికార్ అహ్మద్తో కలిసి బంజారాహిల్స్, సరూర్నగర్ ఈ-సేవా కేంద్రాలలో దోపిడీకి పాల్పడ్డాడు. గుజరాత్లో కానిస్టేబుల్ హత్యకేసు, సైదాబాద్లో వాహనం దొంగతనం, చిక్కడపల్లిలో ఆయుధాల కేసు, కంచన్బాగ్, ఫలక్నుమా, హుస్సేనీ ఆలం ఠాణాల పరిధిలో పోలీసులపై కాల్పుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. క్రైం నం.566/2007 (బంజారాహిల్స్), 1345/2007(సరూర్నగర్), 238/2007 (కాగ్డపిత్), 389/2007(మణినగర్), 402/2008 (సైదాబాద్), 528/2008 (చిక్కడ్పల్లి), 358/2008 (కంచన్బాగ్), 157/2009 (ఫలక్నుమా), 87/2010 (హుస్సేనీఆలం), 446/2010 (ఉప్పల్), 64/2011(కుషాయిగూడ), భువనగిరి ఠాణాలో కేసులు నమోదయ్యాయి.
మహ్మద్ జకీర్
-ఫలక్నుమా, హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులపై కాల్పులు జరిపి హత్యచేసిన ఘటనలో క్రైం నం.157/2009 (ఫలక్నుమా), 87/2010 (హుస్సేనీ ఆలం) ఠాణాలో నమోదయిన కేసులలో నిందితుడు.
ఇజార్ ఖాన్
-ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇజార్ పోలీసులపై కాల్పులు, హత్య కేసులలో (క్రైం నం.157/2009- ఫలక్నుమా, 87/2010- హుస్సేనీ ఆలం, 238/2007- కాగ్డపిత్, 389/2007- మణినగర్, 64/2011- కుషాయిగూడ), భువనగిరిలో ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు.
మహ్మద్ హనీఫ్
-పోలీసులపై కాల్పులు, హత్య కేసులలో ఇతడు నిందితుడు. ఇతనిపై క్రైం నం.157/2009 (ఫలక్నుమా), 87/2010 (హుస్సేనీ ఆలం), 238/2007 (కాగ్డపిత్), 389/2007 (మణినగర్), 64/2011 (కుషాయిగూడ), భువనగిరిలో జరిగిన ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి కేసులున్నాయి.