కలెక్టర్ వేధిస్తున్నారు.. ఒక్క గజం కూడా రిజిస్టర్ చేయించుకోలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
అసలు చెరువు శిఖం భూమి, అసైన్డ్ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించేందుకు కంప్యూటర్ వెబ్ సైట్ అనుమతించదన్నారు.
జనగాం: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వివాదం ముదురుతోంది. బతుకుమ్మ కుంట భూముల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని స్థానిక కలెక్టర్ దేవసేన ఆరోపిస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి చుక్కలు: తడాఖా చూపిన కలెక్టర్ దేవసేన..
ఎమ్మెల్యే అక్రమాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలున్నాయని ఆమె చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే మాత్రం ఆరోపణలను ఖండిస్తున్నారు. బతుకమ్మ కుంటలో ఒక్క గజం కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ఆయన అంటున్నారు.
అసలు చెరువు శిఖం భూమి, అసైన్డ్ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించేందుకు కంప్యూటర్ వెబ్ సైట్ అనుమతించదన్నారు. ఏ తప్పు చేయకున్నా జనగామ కలెక్టర్ శ్రీ దేవసేన తనను ఏడాదిగా వేధించారని అసెంబ్లీ లాబీలో మీడియా ఎదుట వాపోయారు. జనగామలోని బతుకమ్మ కుంట వివాదంపై కలెక్టరుకు మూడు నోటీసులు పంపానని, ఒకటి స్పీకర్, మరొకటి సీఎస్, మూడోది ప్రివిలేజ్ కమిటీ నుంచి వెళ్లాయని అన్నారు.
రాద్దాంతం వద్దు, జరిగింది అదే!: తేలనివ్వండి, ముత్తిరెడ్డిని వణికిస్తున్న కలెక్టర్..
తన నోటీసులకు కలెక్టర్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సమాధానం చెప్పలేక కలెక్టర్ రాజీ ప్రయత్నాలు చేస్తోందని ముత్తిరెడ్డి ఆరోపించారు. సరైన ఆధారాలు చూపించకపోతే ప్రివిలేజ్ కమిటీ ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.