రసమయి సంచలనం: త్వరలో టీఆర్ఎస్లోకి జానారెడ్డి!, ఎన్నికలకు ముందే!
మనసు టీఆర్ఎస్ లో.. మనిషి కాంగ్రెస్ లో అన్న రీతిలో జానారెడ్డి వ్యవహరిస్తుంటారని ఆయనపై పెద్ద అపవాదు ఉంది.
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న ప్రత్యక్ష రాజకీయాల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలవగలిగే సత్తా ఉన్న పార్టీ గానీ నాయకుడు గానీ మరొకరు లేరన్నది సుస్పష్టం. ప్రతిపక్ష పార్టీ నేతల ఫిరాయింపుతో టీడీపీ ఏకంగా ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది. అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. అయితే ఇది కూడా ఎంతో కాలం నిలవదని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
తాజాగా టీఆర్ఎస్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో ఒక్క నేత కూడా మిగలరని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలంతా కారెక్కడం ఖాయమన్నారు. సీనియర్ నేత, సీఎల్సీ నాయకుడు జానారెడ్డి కూడా దీనికేం మినహాయింపు కాదని ఆయన తెలిపారు.
జానాపై అపవాదు:
రాబోయే ఎన్నికలకు ముందు వారంతా జానాతో సహా కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ లో చేరుతారని రసమయి ధీమాగా చెప్పారు. రసమయి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. గతంలోనే జానారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా రసమయి చేసిన వ్యాఖ్యలు దాన్ని తెర మీదకు తెచ్చాయి. కాంగ్రెస్ లో ఉంటూనే టీఆర్ఎస్ ను వెనకేసుకొచ్చే నేతగా సొంత గూటి నేతల నుంచే జానారెడ్డి అపవాదు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.
సొంతగూటి నేతల నుంచే జానాకు విమర్శలు:
మాట్లాడితే చాలు టీఆర్ఎస్ కు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారంటూ గతంలో జానారెడ్డిపై ఏకంగా హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ కు సహకరిస్తున్నాడని గతంలో పాల్వాయి గోవర్దన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఆయన టీఆర్ఎస్ కోవర్ట్ అని, పార్టీని ముంచుతాడని అప్పట్లో ఆయన ఆరోపించారు.
జానారెడ్డి తీరుతో కాంగ్రెస్ లో అసంతృప్తి:
గ్రేటర్ ఎన్నికలకు ముందు జానారెడ్డి చేసిన ఒక కామెంట్ పై ఆ పార్టీ నేతలు ఇప్పటికి ఆయన్ను తిట్టుకుంటూనే ఉంటారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన రూ.5భోజనాన్ని ఏరి కోరి మరీ తెప్పించుకున్న ఆయన.. ఆ భోజనం అద్భుతమని పొగిడేశారు. దీంతో అధికార పార్టీకి ఆయనే ప్రచారాన్ని కల్పించినట్లయింది. ఇది ఆ తర్వాతి ఎన్నికల్లోను టీఆర్ఎస్ కు కలిసొచ్చింది.
మనసు టీఆర్ఎస్ లో.. మనిషి కాంగ్రెస్ లో:
మనసు టీఆర్ఎస్ లో.. మనిషి కాంగ్రెస్ లో అన్న రీతిలో జానారెడ్డి వ్యవహరిస్తుంటారని ఆయనపై పెద్ద అపవాదు ఉంది. ఇందుకు కారణం పలుమార్లు ఆయన టీఆర్ఎస్ ప్రచారకుడిగా వ్యవహరించడమే. గతంలో రెండు పంటలకు నీళ్లిస్తే టీఆర్ఎస్ కు సలాం కొట్టి, ఆ పార్టీ ప్రచార కార్యకర్తగా ఉంటానని అన్నారు.
ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తే టీఆర్ఎస్ తరుపున తానే ప్రచారం చేస్తానన్నారు. ఇలాంటి సవాళ్లు చేసి టీఆర్ఎస్ లో చేరాలన్న కోరికను జానారెడ్డి బయటపెట్టుకుంటున్నారన్న విమర్శలు ఆయనపై వచ్చాయి.
రసమయి విషయానికొస్తే:
కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ గూటికే వస్తారని చెప్పుకొచ్చిన రసమయి.. అధికారులు మాత్రం తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధికారులు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ నిబంధనలు పాటించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలకు ఏం తెలుసనే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోను రసమయి వివాదం:
గతంలో కరీంగనర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డిజిధన్ కార్యక్రమంలోను రసమయి కలెక్టర్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ వినోద్ కుమార్ ఫోటో ఎందుకు లేదంటూ ఆయన నిలదీయడంతో కలెక్టర్ కు రసమయికి మధ్య వివాదం తలెత్తింది.
ఎంపీ ఫొటో ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యేలు గంగుల, రసమయి కాసేపు వేదిక ముందు ఆందోళన చేశారు. మళ్లీ ఇలాంటివి పునరావృత్తం కాకూడదని కలెక్టర్ ను రసమయి హెచ్చరించగా.. కలెక్టర్ కూడా 'డోంట్ టాక్ లైకి దిస్' అని వేలెత్తి మరీ హెచ్చరించారు.