టీడీపీ అంటే చంద్రబాబుది కాదు, సీఎం కావాలని కోరితే తప్పేంటి?: జానారెడ్డి ఆసక్తికరం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హరీశ్ వల్లే టీఆర్ఎస్! కేసీఆరే నా గాడ్ఫాదర్, కానీ..: బాబు మోహన్ ఆవేదన
టీడీపీ అంటే చంద్రబాబుది కాదు..
టీడీపీ అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిదేమీ కాదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్కు లేదని అన్నారు.
కేసీఆర్కు అదే భయం
చంద్రబాబు పేరిట ప్రజలను రెచ్చగొట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్-టీడీపీ కలయికతో కేసీఆర్కు భయం పట్టుకుందని విమర్శించారు.
తనను సీఎంగా చూడాలనుకోవడంలో తప్పేంటి?
తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఇచ్చిన వాగ్ధానాలపై సమాధానం చెప్పలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులు తనను సీఎంగా చూడాలనుకోవడంలో ఎటువంటి తప్పులేదని అన్నారు.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ రఘువీర్ రెడ్డి
ఇది ఇలా ఉండగా, జానారెడ్డి కుమారుడు కుందురు రఘువీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను 2004 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాని చెప్పారు. ఓ కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గతంలో ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఈసారి కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
జానాను సీఎం కావాలని కోరుకుంటున్నారు
నల్గొండ జిల్లాలో పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మీడియా సమావేశంలో రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి జానారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తన తండ్రి సీఎం కావడం కాన్నా ఇంకేం కావాలని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని మహా కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనతో విసిగిపోయారని మండిపడ్డారు.