'కోమటిరెడ్డిని జానారెడ్డి బుజ్జగిస్తున్నారా..!', ఆ భయంతోనే కేసీఆర్ ఇలా.. : చెరుకు సుధాకర్
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుబోతున్నారని కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోమటిరెడ్డి పార్టీ మార్పు ప్రయత్నాలకు బ్రేక్ వేసేందుకే జానారెడ్డి ఆయనతో భేటీ అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు జానారెడ్డి.
కాంగ్రెస్ పై విమర్శలు.. అధికార పార్టీ నేతలతో కోమటిరెడ్డి భేటీలు.. ఆయన పార్టీ మార్పు అంశాలను తెర పైకి తెచ్చిన నేపథ్యంలో ఎలాగైనా ఆయన్ను బుజ్టగించి పార్టీలోనే కొనసాగేలా చేయాలని భావిస్తున్నారట జానారెడ్డి. ఈ విషయమై చర్చించేందుకే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం.
ఆ భయంతోనే కేసీఆర్ ఇలా.. : చెరుకు సుధాకర్
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఉద్యమ వేదిక నాయకులు చెరుకు సుధాకర్. ఎక్కడ.. ప్రభుత్వం కూలిపోతుందోనన్న భయంతోనే రాజకీయ పునరేకీకరణ పేరుతో, కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో కేసీఆర్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. అవినీతి, అహంకారంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టిన ఆయన, టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ వేదిక ఏర్పడుతుందేమోనన్న భయంలో కేసీఆర్ ఉన్నారన్నారు.
కోదండరామ్ పై ప్రభుత్వ వర్గాల నుంచి కౌంటర్ ఎటాక్ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన చెరుకు సుధాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.