ప్రజారాజ్యం బాటలోనే జనసమితి..! కోదండరాం మొగ్గుచూపుతుంది అటువైపేనా..??
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీని ఓడించేందుకు రాజకీయంగా చాలా ప్రయత్నాలు జరిగాయి. మహాకూటమిగా ఏర్పడ్డ నాలుగు పార్టీలు టీఆర్ఎస్ పై పైచేయి సాధించేందుకు అనేక ప్రణాళికలు రచించాయి.కాగా తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో అదికార గులాబీ పార్టీ విజయం సాదించడంతో ప్రతిపక్ష పార్టీలు ఖంగుతిన్నాయి. ఓటమి పాలైన పార్టీలు అందుకు గల కారణాలను విశ్లేషించుకుంటుండగా కొన్ని పార్టీలు తమ మనుగడ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసమితి విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
విలీనం దిశగా కోదండరాం..! జనసమితిని కాంగ్రెస్ లో కలిపేందుకు సన్నాహాలు..!!
తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు పార్టీలతో కలిసి ఏర్పడిన ప్రజాకూటమికి రాష్ట్ర ప్రజలు షాక్ ఇచ్చారు. కూటమి మొత్తం స్థానాల్లో పోటీ చేసినా.. కేవలం 21 నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19, తెలుగుదేశం రెండు స్థానాలను దక్కించుకోగా, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ మాత్రం ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి తరపున పోటీ చేసిన చాలా మంది ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. దీంతో ఫలితాల తర్వాత ఏ ఒక్క నేత కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు.
కాంగ్రెస్ తో కుదిరిన ఒప్పందం..! నేడో రేపో ఒప్పందం..!
ముందస్తు ఎన్నికల తర్వాత తెలంగాణ జనసమితి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రొఫెసర్ కోదండరాం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారనే అంశం పై వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ విషయం సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ చానెళ్లలో కూడా ప్రసారం అయింది. దీంతో ఈ వార్త నిజమేనేమోనన్న అనుమానం అందరిలో కలిగింది. దీనికితోడు, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతోనే కలిసి నడుస్తారని పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
తాజాగా విలీనంపై స్పష్టత..! త్వరలోనే ముహూర్తం..!!
రాష్ట్రంలో టీజేఎస్ మనుగడ కొనసాగుతుందని, కాంగ్రెస్లో విలీనం చేయబోమని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంగీలు మార్చుకున్నంత సులభంగా కొందరు నేతలు పార్టీలను మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ప్రజాసమస్యలపై పోరాడేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పారు. లోక్సభతోపాటు అన్ని ఎన్నికలకూ తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో పలు చోట్ల అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని తెలిపారు. జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ప్రొఫెసర్ కోదండరాం.
కాంగ్రెస్ ప్రయాణం ఓకే..! అందుకే విలీనం అంటున్న ప్రొఫెసర్..!!
విభజనకు ముందు తర్వాత కొద్దిరోజులు కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఆయన ఉన్నట్లుండి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై అడపాదడపా విమర్శలు చేస్తూనే వచ్చారు. కొద్దిరోజుల తర్వాత తన పంథాను రాజకీయ పోరాటం వైపు మళ్లించారు. అప్పటి వరకు ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ వచ్చిన ఆయన, రాజకీయకంగానే అమీతుమీకి సిద్ధమవ్వాలనే ఉద్దేశంతో ‘తెలంగాణ జనసమితి' పార్టీని స్థాపించారు. కాని పార్టీని సుధీర్గ కాలం నడిపే సామర్త్యం కాని, ఆర్థిక స్తోమత గాని కోదండరాం కి లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.