SyeRaa Pre-Release: అన్నయ్యతో కలిసి వచ్చిన జనసేన అధినేత, వర్షంలో తడుస్తూ...
హైదరాబాద్: కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈవెంట్ ప్రారంభమైన దాదాపు రెండు గంటలకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ముగ్గురు ఒకేసారి వచ్చారు. వారిని చూసిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదేళ్ల తర్వాత ఈ ముగ్గురు ఒకే వేదికపై కనిపిస్తున్నారు.
గతంలో జల్సా, ఆ తర్వాత మగధీర సినిమా కార్యక్రమాల్లో వీరు ముగ్గురు కనిపించారు. ఆ తర్వాత ఎవరో ఇద్దరే స్టేజ్ పైన కనిపించారు. ఆ తర్వాత ముగ్గురు కనిపించడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి ఈవెంట్ హోస్ట్గా వ్యవహరించారు.
పెద్ద ఎత్తున అభిమానులు
సైరా వేడుక కోసం మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలామంది ఎంట్రీ పాసులు ఉన్నా లోపలికి అనుమతించకపోవడంతో అసహానానికి, ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియం మొత్తం నిండిపోవడంతో వీఐపీ పాసులు ఉన్నా లోనికి అనుమతించని పరిస్థితి. గేట్లు మూసేయడంతో ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
రాగానే కాసేపటికి వర్షం...
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ వచ్చిన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. ఈవెంట్ ప్రారంభానికి ముందే వర్షం వచ్చి పోయింది. దీంతో అందరూ ఆనందించారు. ఈవెంట్ ముగిసే వరకు వర్షం రావొద్దని కోరుకున్నారు. కానీ ముగ్గురు వేదిక పైకి వచ్చిన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. అభిమానులు వర్షంలో తడుస్తూ ఈవెంట్ను వీక్షించారు.
రూ.300 కోట్లతో సినిమా
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కిచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే వేదిక వద్ద వాతావరణం కోలాహాలంగా మారింది.