తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన..! అభ్యర్థుల బయోడేటాల పరిశీలనలో గబ్బర్ సింగ్..!!
హైదరాబాద్ : తెలుగు బాష లెక్క జనసేన ఆడా ఉంటది.. ఇప్పుడు ఈడా ఉంటది. తెలంగాణ లోక్ సభ ఎన్నికలో పోటీ చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబందించిన వివరాలను బయోడేటా రూపంలో తెలుసుకునేందుకు జనసేన కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను సేకరిస్తుంది పార్టీ. అందుకోసం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని వేసారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ కమిటీ ఈ బయోడేటాలను మూడు రోజుల పాటు స్వీకరిస్తుంది. అనంతరం పార్టీ అధినేత నిర్ణయం మేరకు టికెట్ కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. ఇక టికెట్ ఆశించే వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారం దరఖాస్తులో పొందుపరచాలి. ఇందులో కులం పేరు ప్రస్తావించకపోవటం, ఆర్థిక పరిస్థితిని అడగక పోవటం గమనించదగిన విషయం. కొన్ని పార్టీలు కుల పిచ్చితో కొట్టుకుంటున్న ఈ తరుణంలో జనసేన పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గొప్పదే.
స్వీట్ వార్నింగ్: అంతలోనే కేసీఆర్పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, అసలు కారణం ఇదేనా?
కుల ప్రస్తావన లేకుండా కేవలం వ్యక్తిగత వివరాలతోనే జనసేనలో టికెట్ల కేటాయింపు వంటి అంశం నిజంగా గొప్పదిగానే చెప్పాలి. ఇదే తరహా వ్యూహాన్ని తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం జనసేన అమలు చేస్తే.. కులాలకు నిజంగానే ఘోరీ కట్టేయొచ్చు. మార్పు అన్నది ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్లుగా జనసేన టికెట్ ఆశావహుల నుంచే మొదలైన ఈ కొత్త విధానం సమాజంలో కొంతైనా మార్పు తెస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. జనసేనాని తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఆయన్ను విమర్శిస్తున్న వాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. కులం గోడలను చీల్చటంలో పవన్ అడుగులు భేష్ అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మరి తెలంగాణలో ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.