తెలంగాణలో పోటీ చేసే అంశం పట్ల జనసేన అనూహ్య నిర్ణయం..!!
హైదరాబాద్ : తెలుగు భాష లెక్క ఆడా ఉంటా..! ఈడా ఉంటా..! అని అర్థం వచ్చేలా గతంలో ప్రకటించిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమీషన్ ప్రకటన తర్వాత తెలంగాణలో ఏం చేయబోతున్నారు అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో జనసేన అభిమానులు గాని, పవన్ కళ్యాణ్ ఫాన్స్ గాని ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గతంలో కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు ఈ విషయం ప్రత్యక్షంగా నిర్ధారణ అయింది. ఐతే తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నిసీట్లలో జనసేన పోటీ చేస్తుందనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది.
టీ ఎన్నికల బరిలో జనసేన..? పోటీకి సైయా..? నైయా..?
గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ముఖాముఖి తలపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నా ఎక్కడా కనీస డిపాజిట్లు దక్కలేదు. అప్పుడు టీడీపీ-బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో నిలవబోతోంది. ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. తెలుగుదేశం, వైసీపీతోపాటు, ఈ సారి జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగుతోంది. పవన్ సినీ ఇమేజ్, సామాజికవర్గ ప్రభావంతో జనసేన కొన్నిచోట్ల ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో పవన్ పార్టీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే రాజకీయాల్లో స్పీడు పెంచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఈ ఎన్నికల్లో జనసేన సక్సెస్ అవుతుందంటున్న నేతలు..!
ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు జనసైనాని. ఇన్ని రోజులు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇష్టపడిన పవన్.. ఇప్పుడు తన యాత్రకు ఎక్కువగా బ్రేక్ ఇస్తున్నాడు. ఈ విరామాన్ని పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు, పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలు రచించడానికే వాడుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపునకు తిప్పుకోవడంలో జనసేన సక్సెస్ అవుతోందని కొంత మంది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం జనసేన పార్టీకి మరింత బలాన్నిచ్చినట్టు అవుతుందని తెలుస్తోంది.
తెలంగాణలో పోటీ చేస్తామని పవన్ ప్రకటన..! ఎన్ని సీట్లు..?
మరోవైపు, కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పోటీ చేస్తామని స్వయంగా ప్రకటించారు పవన్. తెలంగాణలో పోటీ చేయాలన్న ఆలోచనతో పవన్.. ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే అంశం మీద పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ తో సమావేశమై సుదీర్ఘంగ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో కొందరు ఆశావహులు, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనను సంప్రదిస్తున్నారని, ఈ మేరకు మాదాపూర్లోని పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారని పార్టీ నేతలే చెప్పారు. వీటిని చూసిన తర్వాత జనసేన కచ్చితంగా పోటీ చేయబోతుందని, దీంతో ఏ పార్టీ పైన ప్రభావం చూపుతుందో అనే ప్రచారం జరిగింది.
అయోమయానికి గురి చేసిన షెడ్యూల్..! నిర్ణయం పై ఉత్కంఠ..!!
అయితే, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడమేనని తెలుస్తోంది. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అంతగా బాగోపోవడంతో పాటు, అక్కడ జనసేనకు వ్యవస్థాగత నిర్మాణం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే భంగపాటు తప్పదని గ్రహించిన పవన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఈసీ ప్రకటన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం, కాకపోతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నిర్ణయాన్ని మార్చుకున్నాం అని పవన్ తన సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో పోటీ చేసే అంశం పట్ల పవన్ ఓ అవగాహనకు వచ్చినట్టు తెలిసిపోయింది.