రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలు
హైదరాబాద్/రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తూర్పు గోదావరి రాజమహేంద్రవరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తాను 2014లో హైదరాబాదులో పార్టీని ప్రకటించానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన పోటీ గురించి మాట్లాడారు.
ఇక దూరమేనా.. జగన్ తర్వాత చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్!
రాజమండ్రి నుంచి తెలంగాణ యువతకు చెబుతున్నా
ఇప్పటి వరకు తాను తెలంగాణలో పోటీ చేయలేదని, కానీ తెలంగాణలోని జనసైనికులు, యువత కూడా మార్పును కోరుకుంటారని, అప్పుడు వారికి తాము (జనసేన) కచ్చితంగా అండగా నిలబడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను రాజమండ్రి వేదికగా, తూర్పు గోదావరి జిల్లా నుంచి చెబుతున్నానని, తెలంగాణ యువత కోరుకుంటా తాము అండగా ఉంటామని చెప్పారు. ఆ సమయం వస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ముందు ముందు పోటీ చేస్తాం
తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీకి చెందిన వారిని కమ్మ, కాపు, మాల, రెడ్డి అని అక్కడ (తెలంగాణ) చూడలేదని, అందరిని ఆంధ్రులుగా చూశారని చెప్పారు. కొద్దిమంది ఆంధ్రులను దారుణంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము ఇప్పటి వరకు పోటీ చేయలేదని, కానీ ముందుముందు పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణకు జనసేన అవసరం ఉంది
1996లో బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఇదే జిల్లా నుంచి చెప్పింది, ఈ రోజు అదే తూర్పు గోదావరి నుంచి చెబుతున్నానని, తెలంగాణకు జనసేన అవసరం ఉంటుందని, తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన కచ్చితంగా ఉండి తీరుతుందని చెప్పారు. ఏపీ వేదికగా పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.