Janata Curfew: కేసీఆర్పై జగ్గారెడ్డి ప్రశంసలు.. ప్రధాని మోడీపై కూడా... ఎందుకంటే..
కేసీఆర్, హరీశ్ రావు పేరు ఎత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాంటి నేత మాట తీరు మారింది. అవును కరోనాకు సంబంధించి జనతా కర్ఫ్యూ సందర్భంగా కేసీఆర్ను జగ్గారెడ్డి కొనియాడారు. ప్రధాని మోడీని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. జనతా కర్ఫ్యూ భేష్ అని.. కానీ దానిని మరిన్ని రోజులకు పెంచాలని కోరారు.
జనతా కర్ఫ్యూ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబసభ్యులతో గడిపారు. కరోనా వైరస్ నివారణ చర్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను కొనియాడారు. జగ్గారెడ్డి అంటే.. టీఆర్ఎస్, బీజేపీపై ఒంటికాలిపై లేస్తారని అనుకొంటాం.. కానీ జనతా కర్ప్యూ సందర్భంగా కేసీఆర్పై పాజిటివ్గా మాట్లాడారు. తీసుకుంటున్న చర్యలు భేష్ అని ప్రశంసించారు. ప్రధాని మోడీని కూడా కీర్తించారు.
జనతా కర్ఫ్యూను తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజు కాకుండా.. 15 రోజులు పెడితే బాగుంటుందని జగ్గారెడ్డి సూచించారు. దీంతో వైరస్ సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జగ్గారెడ్డి ప్రతిపాదన చేశారో లేదో... వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా వేగంగా స్పందిస్తోంది. మరో పదిరోజులపాటు కర్ఫ్యూ సడలించాలని భావిస్తోంది.
అత్యున్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని.. ప్రకటిస్తారు. కానీ జగ్గారెడ్డి మాత్రం 15 రోజులు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి 31వ తేదీ వరకు పది రోజులు కర్ఫ్యూ విధించాలని భావిస్తోంది.