Janata Curfew: తెలుగు రాష్ట్రాల్లో ‘జనతా కర్ఫ్యూ’,బోసిబోయిన భాగ్యనగరం, ఏపీలో కూడా..
జడలువిప్పిన కరోనా రక్కసిని అరికట్టేందుకు ఎవరి ఇళ్లల్లో వారు ఉండి.. వైరస్ను నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. ఉదయం నుంచే రహదారులు బోసిపోయాయి. షాపులు, వాణిజ్య సముదాయలు మూతపడిపోయాయి. జనం లేక ప్రధాన సెంటర్లు కూడా నిర్మానుష్యంగా కనిపించాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉద్యమ సమయాన్ని మరోసారి గుర్తుకు తీసుకొచ్చింది. ట్యాంక్బండ్పై ఒక్కరు కూడా లేక బోసిపోయి కనిపించింది. నిత్యం రద్దీగా ఉండగా చార్మినార్, ఎంజీబీఎస్ కూడా జనం లేక వెలవెలబోయింది.
జనతా కర్ఫ్యూ...
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ' పాటించాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునివ్వగా.. తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచే పాటిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు రహదారులపై ఒక్కరు కూడా లేరు. సోమవారం ఉదయం 6 గంటల వరకు పరిస్థితి ఇదేవిధంగా ఉంటుందని.. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్చందంగా సహకరించాలని కేసీఆర్.. కోరగా అన్ని వర్గాలు సహకారం అందించాయి. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎక్కడివారక్కడ ఉన్నారు. ఇంటి వద్దే ఉంటూ పిల్ల, పాపలతో కాలక్షేపం చేస్తున్నారు.
ఎమర్జెన్సీ..
ఆసుపత్రులు, మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, అగ్నిమాపక శాఖ; కూరగాయాలు, పెట్రోల్ బంక్, మీడియా సిబ్బందికి తెలంగాణ రాష్ట్రంలో అనుమతిచ్చారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మాదిరిగా ఏపీలో వీటితోపాటు.. పెట్రోల్ బంక్లు కూడా మూసివేశారు. ప్రజలంతా స్వచ్చందంగా బంద్కు సహకరించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. తెలుగురాష్ట్రాల్లో పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
Recommended Video
బోసిపోయిన నగరాలు..
ఏపీలో ప్రధాన నగరాల్లో రద్దీ అనూహ్యంగా తగ్గిపోయింది. విశాఖపట్టణం బెంజ్ సర్కిల్ వద్ద రహదారి నిర్మానుష్యంగా మారిపోయింది. సాగరతీరంలో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అమరావతి, కర్నూలు, విజయవాడలో కూడా సేమ్ సిచుయేషన్. ప్రజలంతా‘జనతా కర్ప్యూ'ను పాటిస్తున్నారు. ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించాలని నేతలు, సినీతారలు ఇచ్చిన పిలుపునకు ప్రజలు సానుకూలంగా స్పందించి.. ఇళ్లకే పరిమితమయ్యారు.