జనతా కర్ఫ్యూ : కేసీఆర్ చెప్పినా కూడా మోడీకి వ్యతిరేకంగా పోస్టులు.. టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్
కరోనాపై ఇప్పుడు ప్రపంచం పోరాడుతుంది. ఇక భారత్ సైతం కరోనాపై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టటం మాత్రమే కాదు పరిస్థితి చెయ్యి దాటిపోకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నేడు జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వాల ప్రయత్నానికి మద్దతు తెలుపుతున్నారు .
కేసీఆర్ చెప్పినా సరే ప్రధానిపై ట్రోల్స్
ఇక ఈ సమయంలోనే రాజకీయాలను పక్కన పెట్టి అందరూ సమైక్యంగా పోరాటం సాగించాలని కేంద్రానికి మద్దతు తెలిపారు. ఇక తెలంగాణా సీఎం కేసీఆర సైతం మోడీ పిలుపును స్వాగతించి ప్రజలందరూ మద్దతు తెలపాలని అవహేళన చేసినట్టు ఎవరు మాట్లాడినా సరే కేసులు నమోదు చెయ్యాలని పేర్కొన్నారు. ఇక ఇది రాజకీయాలు చేసే వేళ కాదు. అందరం ఒక్కటై కరోనాను దేశం నుంచి తరిమికొట్టాలని అటు మోడీ , ఇటు కేసీఆర్ చెప్పినా కొందరూ ఆయన పిలుపును కూడా ట్రోల్ చేస్తున్నారు.
కర్ఫ్యూకి వ్యతిరేకంగా కామెంట్లుపెట్టిన టీఆర్ఎస్ కౌన్సిలర్
కర్ఫ్యూకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ , హేళన గా పోస్ట్ లు పెట్టే వారిని ఇడియట్స్ అని సంభోదిస్తూ మండిపడినప్పటికీ సొంత పార్టీ కౌన్సిలర్ ఆ పని చేశారు. ఇక ప్రధాని మాట వినాల్సిన అవసరం లేదని ఆయన చేసిన పోస్ట్ తో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సంగారెడ్డికు చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ షమీ మాత్రం అటు ప్రధాని విజ్ఞప్తిని, ఇటు సీఎం ఆదేశాలను కూడా లెక్క చెయ్యలేదు. ఆయన ఏకంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
కేసు నమోదు ..అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రధాని పిలుపుని ఒక చెవితో విని మరో చెవితో వదిలెయ్యాలని, ముస్లింలంతా రోడ్డుపైకి రావాలని షమీ పిలుపునిచ్చారు. ఆ పోస్టింగ్లు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు సమిని అరెస్ట్ చేశారు.టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్ అవ్వడం తెలంగాణా రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. అధినేత ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆయన పోస్ట్ పెట్టటంపై సొంత పార్టీ నేతల్లో చర్చకు కారణం అవుతుంది .