Janata Curfew: ఇంట్లో ఉండే కరోనాను ఖతం చేద్దాం, కర్ప్యూ సందర్భంగా ఫ్యామిలీతో మంత్రులు బిజీ...
తెలుగురాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంటి వద్ద ఉండిపోయారు. పిల్ల పాపలతో సరదాగా గడుపుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు కుటుంబసభ్యులతో కలిసి జనతా కర్ప్యూలో పాల్గొన్నానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజలంతా స్వచ్చందంగా జనతా కర్ప్యూలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
బీ అలర్ట్..
వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీశ్ రావు సూచించారు. ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉండొద్దని పేర్కొన్నారు. ఇంట్లో ఉండి కరోనాను ఖతం చేద్దామని మంత్రి ప్రతీనబూనారు. కరోనాను నిర్లక్ష్యం చేసిన దేశాలు మూల్యం చెల్లించుకుంటున్నాయని వివరించారు. వైరస్ ప్రబలుతోన్న ముందే మేల్కోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
దేశమంతా క్వారంటైన్..
కరోనా వైరస్తో దేశమంతా క్వారంటైన్లో ఉందన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. వైరస్ నివారణ కోసం వైద్యారోగ్య సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఒకరికొకరు కలువకుండా ఉండి.. వైరస్ వ్యాప్తిని అరికడుదామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇంట్లో పిల్లలతో కలిసి గడిపారు.
పిల్లలతో కలిసి జాలీగా..
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనమలు, మనమరాళ్లతో కలిసి పిల్లాడైపోయారు. వారితో ఆడుకొన్నారు. చాలారోజుల తర్వాత సమయం దొరికిందని పేర్కొన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో బిజీగా గడిపారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కార్యాలయానికి పరిమితమయ్యారు.
ఫ్యామిలీతో మోపిదేవి, కేశినేని
ఏపీలో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఫ్యామిలీతో గడిపారు. వైరస్ను నిర్మూలించేందుకు అందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఇంట్లోనే గడిపారు.