19న తెలంగాణా బంద్ కు జనసేన మద్దతు ... ఆర్టీసీ కార్మికులకు అండగా పవన్
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఈ నెల 19 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే . తెలంగాణా రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యలపై మనస్తాపం వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆర్టీసీ కార్మికుల విషయంలో వారిని సంక్షోభం నుండి బయటపడేలా ప్రభుత్వం చొరవ చూపాలని ట్విట్టర్ వేదికగా కోరారు. ఇక నేడు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో . ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరమని జనసేన పార్టీ వ్యాఖ్యానించింది.
ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె .. 10వ రోజు బస్టాండ్ ల ముందే బహిరంగ సభలతో నిరసన
ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చిందని, ఇలాంటి పరిస్థితిలో అయినా కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలని జనసేన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇకపై ఇలాంటి ఆత్మహత్యలు, బలిదానాలు జరగకూడదని జనసేన పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది . 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చేసిన ప్రకటన ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజలకు సైతం ఆవేదన కలిగిస్తుందని జనసేన అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అనే ఆందోళన ప్రతి ఆర్టీసీ కార్మికుడిలో వ్యక్తం అవుతుందని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరింది. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని సమ్మె మరింత ఉధృతం కాకుండా సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని జనసేన కోరింది.
ఆర్టీసీ సమ్మె ప్రారంభం అయిన సందర్భంలో కూడా జనసేన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయినా తెలంగాణా ప్రభుత్వం ఎవరి మాట లక్ష్య పెట్టటం లేదు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో అంతే నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.