వైయస్ మృతితో కేసీఆర్కు కొత్త జీవితం: విభజనపై పవన్ కళ్యాణ్కు జైరాం కౌంటర్
విశాఖ: వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో తెరాస అధినేత కేసీఆర్కు కొత్త జీవితం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి దాకా మనుగడ లేని తెరాసకు వైయస్ మృతి తర్వాత జీవం వచ్చిందన్నారు.
2009 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైయస్ మృతి వరకు తెరాస ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. 2004లో గెలిచిన వారిలో పదహారు మందిని వైయస్ రాజశేఖర రెడ్డి లాక్కున్నారు. 2009లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
చివరి నిమిషంలో కేసీఆర్ ఊహించని షాక్, కేటీఆర్కు కొత్త చిక్కులు!అప్పటికీ కూడా తెరాస పరిస్థితి ఆశాజనకంగా లేదని అంటారు. అయితే, వైయస్ మృతి అనంతరం తెరాస మళ్లీ పుంజుకుందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని జైరాం రమేష్ మరోసారి చెప్పారు.
జైరాం ఇంకా మాట్లాడుతూ... తెరాస పాస్ పోర్టు స్కాముల పార్టీ అని దుయ్యబట్టారు. కేసీఆర్ విభజన కోసం చేసిన సత్యాగ్రహం మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు చేసిన సత్యాగ్రహం వంటిది కాదన్నారు. వైద్యుల పర్యవేక్షణలో, ఐసీ గదుల్లో ఆయన దీక్ష సాగిందన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్
పది రోజుల క్రితం తిరుపతి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... జైరాం నవ్వుతూ రాష్ట్రాన్ని విభజించారని, హ్యాట్సాప్ జైరాం గారు అని వ్యాఖ్యానించారు. దీని పైన కూడా జైరాం రమేష్ స్పందించారు. తాను భారత దేశాన్ని, పాకిస్తాన్ను విభజించిన వైశ్రాయిని కాదని కేవం ఏపీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించిన ఎంపీని మాత్రమే అన్నారు.
మాది దొంగ దీక్ష కాదు: పొన్నాల
తాము దొంగ దీక్ష చేయలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఆదివారం అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జనగామను జిల్లాగా చేసి, హామీని నిలబెట్టుకోవాలన్నారు. కేసీఆర్ ఎయిర్ పోర్టులో ప్రాజెక్టుల పైన సవాల్ చేయడం హాస్యాస్పదమన్నారు.