జాట్ కులస్తులు ఒక్కటి కావాలని ఢిల్లీలో రేణుకా చౌదరి పిలుపు
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్ సాధించేందుకు జాట్ కులస్తులందరు కూడా ఏకమై రాజకీయ శక్తిగా అవతరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి పిలుపునిచ్చారు.
జాట్లు తమ హక్కుల సాధనకు వివిధ ప్రాంతాల ప్రతినిధులతో వెంటనే కోర్ కమిటీని ఏర్పాటు చేసుకొని కార్యాచరణను రూపొందించుకోవాలని ఆమె సూచించారు.
ప్రస్తుత ఓటు బ్యాంకు రాజకీయాల్లో.. ఏ నాయకుడు విస్మరించలేని విధంగా జాట్కు చెందిన వారి కీలక శక్తిగా ఎదగాలని, తద్వారా కోటాను సాధించాలన్నారు. అందరు కూడా విభేదాలను పక్కన పెట్టి కలిసి పోరాడితేనే హక్కులు సాధించుకోవచ్చునని చెప్పారు.
కేంద్రం ప్రకటించిన ఓబిసి కేటగిరి జాబితాలోకి జాట్లను చేరుస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జాట్ల సమావేశం జరిగింది. ఇందులో రేణుకా చౌదరి మాట్లాడారు. జాట్ల న్యాయమైన డిమాండును సాధించేందుకు ఐదు అంశాలతో అజెండా కోసం కోర్ కమిటీ పని చేయాలన్నారు.
జాట్లు అందరూ ఏకమై కీలకమైన శక్తిగా ఏర్పడే వరకు జాట్ల హక్కును సాధించలేరన్నారు. అందరు కలిసి పని చేయాలన్నారు. మనం మన గొంతును పెంచకుంటే, ఏ ప్రభుత్వం కూడా మన అభ్యర్థనలను పట్టించుకోదని చెప్పారు.