‘సీమాంధ్రులకు అండగా’ చక్కగా చెప్పారు: కేటీఆర్పై జేపీ ప్రశంసలు, ఏమన్నారంటే..?
హైదరాబాద్: తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటానంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. కేటీఆర్ చక్కగా మాట్లాడారంటూ జేపీ ప్రశంసించారు.
సీమాంధ్రులకు అండగా అంటూ కేటీఆర్
‘తెలంగాణలోని సీమాంధ్రులకు నేను అండగా ఉంటాను. కేసీఆర్ కొడుకుగా హామీ ఇస్తున్నా. పొరబాటున మీ మనసులో ఏవైనా అనుమానాలుంటే పక్కనబెట్టండి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు నన్ను సోదరుడిగా భావించండి' అని శనివారం జరిగిన హమారా హైదరాబాద్ కార్యక్రమంలో కేటీఆర్ భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.
‘బాబూ అరాచకం సృష్టిస్తే ఊరుకోం! ఏపీ పోలీసులతో డబ్బులు పంచుతావా?: రాహుల్తో రూ.500కోట్ల డీల్'
కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దు..
కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడటం వల్ల తెలంగాణలో నివాసం ఉంటున్న ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినే ఉద్దేశం ఉండటంతో.. కేటీఆర్ నష్టనివారణకు పూనుకున్నారు. గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించినవి కాదు, చంద్రబాబును మాత్రమే ఆయన విమర్శించారని కేటీఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబును అంటే ఏపీ ప్రజలను అన్నట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ చక్కగా మాట్లాడారంటూ జేపీ
ఈ నేపథ్యంలో సీమాంధ్రులకు అండగా ఉంటానన్న కేటీఆర్ వ్యాఖ్యల పట్ల లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం పెంపొందించడానికి ఆయన వ్యాఖ్యలు దోహదం చేస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతపై కేటీఆర్ చక్కగా మాట్లాడారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రజలను విభజించడం సరికాదు
అంతేగాక, పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం సరికాదని జేపీ వ్యాఖ్యానించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను పార్టీలు విడదీస్తున్నాయి. ఈ చర్యలు వారికి మనస్థాపం కలిగిస్తాయి. కులం, మతం, ప్రాంతం పేరిట ఒకే పార్టీకి గుడ్డిగా ఓటేయడం కూడా నష్టం కలిగిస్తుంది'ని జేపీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
జేపీకి కేటీఆర్ ధన్యవాదాలు
జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్... జేపీ గారికి ధన్యవాదాలంటూ రీట్వీట్ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న కేటీఆర్.. సీమాంధ్రులను తమ వైపు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. టీడీపీ పోటీ చేసినప్పటికీ.. ఆ పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం. సీమాంధ్రులకు అండగా తానుంటానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ద్వారా.. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతోపాటు సీమాంధ్రులు గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో వారి ఓట్లు టీఆర్ఎస్కు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.