జయరామ్ హత్య కేసులో అవాక్కయ్యే నిజాలు ... 1 రౌడీ షీటర్,11 మంది పోలీసులకు హత్యతో సంబంధం
తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఇదే జరుగుతుంది. ఈ కేసు విచారణను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు వివిధ కోణాలలో ఈ హత్యతో సంబంధం ఉన్న వారిని విచారిస్తున్నారు. జయరామ్ హత్య గావింపబడిన సమయంలో కేవలం తనకు ఇస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వనందుకే శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ రాకేష్ రెడ్డి హత్య చేశాడు అని, ఈ హత్య తో శిఖా చౌదరికి సంబంధం లేదని ఏపీ పోలీసులు తేల్చారు. కానీ ఈ కేసుతో రౌడీ షీటర్లకు, రియల్టర్ లకు, పోలీసులకు ఉన్న సంబంధం ఉందనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జయరాం కేసులో షాకింగ్ నిజాలు ..పోలీసులు, రౌడి షీటర్ పాత్ర
జయరాం మర్డర్ కేసులో కొత్త కోణాలు, షాకింగ్ ట్విస్ట్ లు తెలంగాణ పోలీసుల విచారణలో వెల్లడవుతున్నాయి. ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య హత్యకు రాకేష్ రెడ్డికి ఒక రౌడీషీటర్ సహకరించారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ హత్యతో 11 మంది పోలీసు ఆఫీసర్ లకు కూడా సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. జయరాం హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి 11 మంది పోలీసు ఆఫీసర్లకు కాల్ చేసినట్లుగా రాకేష్ రెడ్డి కాల్ డేటా ద్వారా గుర్తించారు పోలీసులు. ఇందులో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్పెక్టర్ల పాత్ర ఉన్నట్లు గా తెలుస్తుంది. నల్లకుంటకు చెందిన ఒక ఏసిపి, ఎస్సై హత్య తరువాత రాకేష్ రెడ్డి తప్పించుకోవడానికి సహకరించినట్లుగా విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఇద్దరిపై వేటు వేసిన పోలీస్ శాఖ ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాకేష్ రెడ్డి కి సహకరించిన వారందరికీ నోటీసులను పంపనుంది.
పోలీసుల అదుపులో రౌడీషీటర్ నగేష్ ... హత్య కేసులో కీలక వ్యక్తి
రాకేష్ రెడ్డికి సినీ వర్గాల తోనూ, రియల్టర్ల తోను, పారిశ్రామికవేత్తలతోను, పోలీసులతోనూ సంబంధాలు ఉన్న నేపథ్యంలో రాకేష్ రెడ్డి తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్న పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఈ కేసులో కేసులోరాకేష్ రెడ్డికి చింతల్ బస్తీ కి చెందిన రౌడీ షీటర్ నగేష్ సహకరించాడని, జయరామ్ హత్యలో ఆ రౌడీ షీటర్ కీలకంగా వ్యవహరించారనిబంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు.గత నెల 31 వ తేదీన రాకేష్ రెడ్డి ఇంట్లో జయరామ్ను తీవ్రంగా కొట్టడంతోఆయన మృతి చెందినట్టుగా రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలోవెల్లడించినట్టుగా సమాచారం. అయితే జయరాం మృతి చెందిన రోజు రాకేష్ రెడ్డి తో పాటు, రౌడీ షీటర్ నగేష్ కూడా ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు..
10 ఖాళీ బాండ్ పేపర్లపై కొట్టి బెదిరించి సంతకాలు చేయించిన రాకేశ్ రెడ్డి
ఇక రాకేష్ రెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలని రాకేష్ రెడ్డి నుండి జయరామ్ ఒక్క పైసా కూడ అప్పు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. సంపన్న వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ నుండి డబ్బులను రాబట్టేందుకు ఒక పక్కా ప్లాన్ తో ఆయనను బెదిరింపులకు గురి చేశారని పలు మార్లు ఆయన నుండి డబ్బులు వసూలు చేశారని తెలుస్తుంది.అంతే కాదు ఆయన నుండి డబ్బు వసూలుకు నకిలీ పత్రాలను సృష్టించినట్టుగా రాకేష్ రెడ్డిపోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం. సుమారు 10 ఖాళీ బాండ్ పేపర్ ల పైన జయరామ్ తో రాకేష్ రెడ్డి సంతకాలు చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. రాకేష్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు జయరాం ను విపరీతంగా కొట్టి సంతకాలు పెట్టించి నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చింతల్బస్తీకి చెందినరౌడీ షీటర్ నగేష్సహాయంతోరాకేష్ రెడ్డి జయరామ్ నుండి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో రౌడీ షీటర్ నగేష్ పాత్ర ఉందని ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగేష్ నోరు తెరిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
హత్యలో మరికొందరి పాత్ర పై విచారణ
జయరాం బలహీనతలను ఆసరాగా చేసుకుని జయరాం కు అమ్మాయిని ఎర వేసి ఇంటికి పిలిపించిన రాకేష్ రెడ్డి పక్కా ప్లాన్ తోనే ఈ మర్డర్ చేసినట్లుగా విచారణలో వెల్లడించిన అంశాలను బట్టి పోలీసులు గుర్తించారు.రాకేష్ రెడ్డితో పాటు వాచ్మెన్ శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే సహకరించాడా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యలో మరికొందరు పాత్ర ఉన్నట్టు గుర్తించిన పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. శిఖా చౌదరిని కూడా విచారించిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తూ షాకింగ్ విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.