మాట్లాడేందుకు నేను ముందుకు వస్తా: చలించిపోయిన జయసుధ
హైదరాబాద్: అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని, ప్రభుత్వాల సహాయం కోరేందుకు తాను ముందుకు వస్తానని ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బుధవారం నాడు అన్నారు.
అరుదైన వ్యాధులు ఎందుకు వస్తాయో పూర్తిగా వెల్లడి కాకపోయినా అవి రాకుండా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాజం దృష్టి సారించాలన్నారు. 'లైసోసోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ సపోర్ట్ సొసైటీ' (ఎల్ఎస్డీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఏడో అంతర్జాతీయ అరుదైన వ్యాధుల దినం బుధవారం బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ ఫంక్షన్ హాల్లో జరిగాయి.
ఈ కార్యక్రమంలో జయసుధ పాల్గొన్నారు. వీరితో పాటు రెయిన్బో పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల, వైద్యురాలు డా రాధా రమాదేవి, ఎల్ఎస్డీఎస్ఎస్ అధ్యక్షులు మంజీత్ సింగ్, శాండోర్ సంస్థ ప్రతినిధి శారద, బాధిత చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంతుబట్టని వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను చూసి జయసుధ చలించిపోయారు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 50 మందిని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
అరుదైన వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వాటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. మరికొందరు మాట్లాడుతూ... దక్షిణ భారతదేశంలో జరిగే మేనరికపు వివాహాల కారణంగా అరుదైన వ్యాధులు అధికమవుతున్నాయన్నారు.
హైదరాబాద్లో 2012-15 వరకు 30 శాతం పైగా అనుమానాస్పద కేసులు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వాల నుంచి ఆర్థికసాయం లేదన్నారు. అవగాహన పెంచేందుకు తాము చేపడుతున్న కార్యక్రమాలకు సినీనటులు జయసుధ, కార్తీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారని తెలిపారు.