సైకిలెక్కనున్న జయసుధ: చంద్రబాబుతో భేటీకి బెజవాడకు...
విజయవాడ: మాజీ శాసనసభ్యురాలు, సినీ నటి జయసుధ కాంగ్రెసు పార్టీకి గుడ్పై చెప్పారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఆమె శనివారంనాడు విజయవాడకు చేరుకున్నారు.
చంద్రబాబుతో భేటీ తర్వాత ఆమె తాను టిడిపిలో చేరుతున్న విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. శనివారంనాడే ఆమె టిడిపిలో చేరుతారని అంటున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సికింద్రబాదు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరి, 2009 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నగర మేయర్, కాంగ్రెసు నేత బండ కార్తిక రెడ్డితో ఆమెకు తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి ఆ విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. కానీ, విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి.
కాగా, బండ కార్తిక రెడ్డికి కాంగ్రెసు పార్టీ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. ఒక వేళ కాంగ్రెసు జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధిస్తే బండ కార్తిక రెడ్డి పేరే మేయర్ పదవికి ముందుకు రావచ్చు. ఈ నేపథ్యంలోనే జయసుధ టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉంటారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటారా అనేది కూడా తేలాల్సి ఉంది.
జయసుధ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరుతారంటూ గతంలో ప్రచారం సాగింది. కానీ, ఆమె టిఆర్ఎస్కు దూరంగానే ఉండిపోయారు. పైగా రాజకీయాల్లో ఆమె ప్రత్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. టిఆర్ఎస్లో జయసుధ టిఆర్ఎస్లో చేరకపోవడానికి అది కూడా ఓ కారణం కావచ్చునని అంటున్నారు.