ల్యాండవుతుండగా విమానంలో మంటలు: శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం
Recommended Video
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి పెనుప్రమాదం తప్పింది. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.
కువైట్ నుంచి వస్తున్న జజీరా ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుధవారం అర్ధరాత్రి 1.30 నిమిషాల సమయంలో నగరానికి చేరుకుంది. రన్ వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం ఇంజిన్ నుంచి మంటలు రావడంతో పైలట్ దాన్ని సకాలంలో నిలిపివేశాడు.
విమానంలో ఉన్న 149 ప్రయాణికులను సహాయ సిబ్బంది సురక్షితంగా కిందకు దించివేశారు. ఓ వైపు మంటలను అదుపు చేస్తుండగా మరో వైపు ప్రయాణికులు కిందకు దిగిపోయారు.
అగ్నిమాపక సిబ్బంది రన్ వేపై ఉన్న విమానం వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.