రెడ్లకు కోచింగ్ సెంటర్ పెడితే రూ. 10 లక్షలు ఇస్తా: జెసి దివాకర్ రెడ్డి
హైదరాబాద్: రెడ్డి అభ్యర్థుల కోసం ఎవరైనా కోచింగ్ సెంటర్ పెడితే తన వంతుగా రూ.10 లక్షలు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. పేద రెడ్డి విద్యార్థులను రెడ్డి సంఘాలు, ఉన్నత స్థానంలో ఉన్న వారు ఆదుకోవాలని, వారికి సరైన శిక్షణ ఇప్పిస్తూ మంచి ర్యాంకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.
ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో సివిల్స్లో ర్యాంకులు సాధించిన రెడ్డి అభ్యర్థులను ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందించారు. రెడ్డి సామాజికవర్గం అనగానే అగ్రవర్ణంగా చిత్రీకరించారని, వీరిలో కూడా పేదలు ఉన్నారని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి చెప్పారు.
రెడ్డి సామాజికవర్గం అభ్యున్నతికి ఐకమత్యంతోపాటు పడాలని పిలుపునిచ్చారు. రెడ్డి కులస్తులు వ్యవసాయం చేసే వారని, నేడు అనేకులు ఉన్నత విద్యలను అభ్యసించి ఆయా రంగాల్లో కీలకంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు.
రెడ్డి రాజుల కాలంలో గొలుసు చెరువులు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయతో వాటిని తిరిగి అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, ఐఏఎస్ అధికారి అజయ్కల్లాం, మెట్రోరైల్ ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి మాట్లాడుతూ నిరుపేద రెడ్డి అభ్యర్థులకు నిత్యం అండగా ఉంటామన్నారు.