బీజేపీ దెబ్బ: విశాఖ-హైదరాబాద్లకు కర్ణాటక ఎమ్మెల్యేలు, అక్కడి ప్రభుత్వం హామీ
హైదరాబాద్: యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు బీజేపీపై న్యాయపరమైన పోరాటం చేస్తూనే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నాయి. అదే సమయంలో జేడీఎస్ పార్టీ అధినేత హెచ్డి దేవేగౌడ, కుమారస్వామిలు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటక ఎఫెక్ట్: బీజేపీకి ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్, తెరపైకి గోవా
ఆ పార్టీ అధినేత దేవేగౌడ ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎంకు ఫోన్ చేసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. మమతా బెనర్జీ, మాయావతి, అమరీందర్ సింగ్ వంటి వారు బీజేపీ తీరును తప్పుబట్టారు.
తెలుగు రాష్ట్రాల రిసార్టులకు ఎమ్మెల్యేలు
ఇదిలా ఉండగా, యడ్యూరప్ప అసెంబ్లీలో బలం నిరూపించుకునే సమయం వరకు తమ పార్టీల ఎమ్మెల్యేలను జేడీఎస్, కాంగ్రెస్లు రిసార్టులలో ఉంచుతున్నాయి. అయితే, బెంగళూరు కంటే ఇతర రాష్ట్రాల్లోనే సేఫ్ అని భావించి, తెలుగు రాష్ట్రాలకు ఆ ఎమ్మెల్యేలను తరలించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరో ఎనిమిది మంది కావాలి
కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో యడ్యూరప్ప రాష్ట్ర గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన మరికొద్ది రోజుల్లో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. దీంతో కాంగ్రెస్ - జేడీఎస్లు జాగ్రత్తపడుతున్నాయి. బీజేపీకి 104 సీట్లు మాత్రమే ఉన్నాయి. యడ్యూరప్ప గెలవాలంటే మరో ఎనిమిది మంది కావాలి.
విశాఖ, హైదరాబాద్లకు ఎమ్మెల్యేలు, కేరళ హామీ
అందుకే, తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా నిరోధించేందుకు కాంగ్రెస్ - జేడీఎస్లు రిసార్టులకు తరలిస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని విశాఖలతో పాటు ఎమ్మెల్యేలను కేరళకు కూడా తరలించనున్నారని తెలుస్తోంది. కేరళలోని లెఫ్ట్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందట.
దైవసాక్షిగా యడ్యూరప్ప ప్రమాణం
గురువారం ఉదయం రాజ్భవన్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప దైవసాక్షిగా, రైతుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప అనే నేను అంటూ దైవసాక్షిగా, రైతుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పేర్కొన్నారు.