ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల: సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
న్యూఢిల్లీ: ఐఐటీ, జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫలితాలను సీబీఎస్ఈ వెబ్సైట్(https://results.jeeadv.ac.in)లో అందుబాటులో ఉంచారు. ప్రణవ్ గోయల్, మీనాలాల్ పరాఖ్లు ఈ ఫలితాల్లో టాపర్గా నిలిచాడు. హర్యానాలోని పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్ 337 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా.... అమ్మాయిల విభాగంలో ఢిల్లీకి చెందిన మీనాలాల్ పరాఖ్ 318 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
కాగా, జాతీయ స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఎస్టీ కేటగిరీలో అగ్రస్థానం దక్కింది. తొలి వంద ర్యాంకుల్లో సుమారు పాతిక మందికి పైగా విద్యార్థులు ఏపీ, తెలంగాణ నుంచే ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచాడు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ ఏడో ర్యాంకు సాధించాడు. ఎస్టీ కేటగిరీలో హైదరాబాద్ విద్యార్థి జాటోత్ శివతరుణ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచాడు.
హైదరాబాద్కే చెందిన శశాంక్ అచ్యుత్కి 62వ ర్యాంకు దక్కింది. ఐఐటీ చెన్నై రీజియన్లో మావూరి శివ కృష్ణ మనోహర్, గోసుల వినాయక శ్రీవర్దన్, అయ్యపు వెంకటఫణి వంశీనాథ్, బసవరాజు జిష్ణు, మేకల అన్మోల్ రెడ్డి మొదటి ఐదు ర్యాంకులను సాధించారు. దేశవ్యాప్తంగా మే 20న ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశపరీక్ష జరిగింది. దీనికి రెండు లక్షల మంది హాజరయ్యారు. వారిలో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది ఉన్నారు.
ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశాల కోసం జూన్ 15 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. షెడ్యూల్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 10,988 సీట్లు, 31 ఎన్ఐటీల్లో17,868 సీట్లు అందుబాటులో ఉన్నాయి.