JEE MAIN 2020 ఫలితాల విడుదల... వంద శాతం స్కోర్లో తెలంగాణ విద్యార్థుల హవా...
జాతీయ స్థాయి విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం(సెప్టెంబర్ 11) రాత్రి విడుదల చేసింది. తాజా ఫలితాల్లో మొత్తం 24 మంది విద్యార్థులు వందకు వంద శాతం మార్కులను సాధించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది విద్యార్థులు వందకు వంద శాతం స్కోర్ సాధించడం విశేషం. మిగతావారిలో ఢిల్లీ నుంచి ఐదుగురు,రాజస్తాన్ నుంచి నలుగురు,ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు,హర్యానా నుంచి ఇద్దరు వందకు వంద శాతం స్కోర్ సాధించినవారిలో ఉన్నారు.
జేఈఈ మెయిన్స్ కోసం మొత్తం 8.58లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... ఇందులో 74శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో సెప్టెంబర్ 27న జరగనున్న జేఈఈ అడ్వాన్స్కు 2.45లక్షల మంది అర్హత సాధించారు. కరోనా వైరస్ వ్యాప్తితో అప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ జేఈఈ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫేస్ మాస్కులు,భౌతిక దూరం,పరీక్షా కేంద్రాల శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు.
నిజానికి నీట్,జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ పలువురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గతంలో జేఈఈ పరీక్షల నిర్వహణను సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై వారు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా... ఆ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం... పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది. అటు ప్రతిపక్షాల విమర్శలు,ఇటు విద్యార్థుల నిరసన మధ్య తొలినుంచి పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపిన కేంద్ర ప్రభుత్వం... ఎట్టకేలకు అనుకున్నట్లుగానే పరీక్షలు నిర్వహించింది.
Recommended Video
Twenty-four candidates score 100 percentile in JEE (Main) exams; highest eight students from Telangana: National Testing Agency (NTA) pic.twitter.com/6EI3YNwKJ4
— ANI (@ANI) September 11, 2020