సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం కపట నాటకం: జీవన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నదని శాసనసభపక్ష ఉపనేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు.
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నదని శాసనసభపక్ష ఉపనేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకమాడుతున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సింగరేణి వారసత్వ ఉద్యోగాల ఫైల్పై సంతకం చేసి ఉంటే ఎంతో మంది సింగరేణి కార్మికుల బిడ్డల కాపురాలు బాగుపడేవని చెప్పారు.
లక్షకు పైగా ఉద్యోగాలను నియమించాల్సి ఉందని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు చెప్పగా ప్రస్తుతం రెండు లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని ప్రశ్నించారు.
డీఎస్సీ నోటిఫికేషన్పై కోర్టు అంక్షింతలు వేసినా ప్రభుత్వ తీరు మారటం లేదని పేర్కొన్నారు. జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందన్నారు.
వృత్తి పన్నును రద్దు చేశామని చెప్పుకోవడంలో ప్రభుత్వానిది ఏమి గొప్పతనం లేదని, తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి రద్దు చేసుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
రాజకీయ కోణాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవించి ఇచ్చారని తెలిపారు. జెడ్పీ మాజీ ఛైర్మన్ వడ్లూరి లక్ష్మన్కుమార్, నాయకులు రామారావు, గండు సంజీవ్, శ్రీనివాస్, రాజేశం పాల్గొన్నారు.