ఓటుకు నోటు: కోలుకున్న మత్తయ్య, ఏబీసీ విచారణకు వస్తారా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలాన్ని సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ4 నిందుతుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆరోగ్యం ఎట్టకేలకు కుదుట పడింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తమ ముందు విచారణకు హాజరు కావాలని తెలంగాణ ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
దీంతో అనారోగ్యం పేరిట ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మదర్ థెరిస్సా ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ ఇచ్చారు. గతంలో ఈ కేసుకి సంబంధించి ఆయన పేరును చేర్చిన వెంటనే మత్తయ్య ఏపీకి పరారైన సంగతి తెలిసిందే.
మత్తయ్యను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు తెలంగాణ ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తర్వాతే ఆయన హైదరాబాదులో అడుగుపెట్టారు. అయితే ఈ నెల 12వ తేదీన ఉప్పల్లోని మత్తయ్య ఇంటికి వెళ్లి మరోసారి నోటీసులను ఏసీబీ అందజేసింది. విచారణకు న్యాయవాదితో కలిసి హాజరుకావొచ్చని అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అనారోగ్యం పేరుతో హైదరాబాదు నుంచి గుంటూరు జిల్లాకు చేరిన ఆయన మరి హైదరాబాదు ఎప్పుడు వస్తారో, తెలంగాణ ఏసీబీ అధికారుల ముందు ఎప్పుడు హాజరవుతారో తెలియాల్సి ఉంది. ఇక ఓటుకు నోటు కేసు విషయానికి వస్తే గతేడాది తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తెలంగాణ టీడీపీ యత్నించింది.
ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసేందుకు అప్పటి టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నేరుగా స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి తొలి విడతగా రూ.50 లక్షలను అందజేశారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (టీ ఏసీబీ) వెనువెంటనే రంగంలోకి దిగి రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
కొన్ని నెలలుపాటు జైల్లో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారంటూ విడుదలైన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. తమ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ఎలా ట్యాపింగ్ చేస్తుందంటూ ఏపీ సర్కారు కూడా పలువురు టెలికాం ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్కు చంద్రబాబు ఆహ్వానం, కేసీఆర్ హాజరైన నేపథ్యంలో ఈ కేసు దాదాపుగా మరుగున పడింది.