భారీ చోరీ: కళ్లల్లో కారం కొట్టి రూ. 30 లక్షలు దోపిడీ, చోరీ చేసిన బైక్లో వచ్చే..
హైదరాబాద్: నగరంలోని రెజిమెంటల్బజార్లో భారీ దోపిడీ జరిగింది. ఒక బంగారం దుకాణం నుంచి మరో దుకాణానికి నగదు తీసుకువెళ్తున్న కార్మికుడి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన దుండగులు.. అతని వద్ద ఉన్న రూ. 30 లక్షలను దోపిడీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
రూ. 30 లక్షలు తీసుకుని..
నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, బాధితుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ జనరల్ బజార్ మహంకాళి స్ట్రీట్లో శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తి ‘రోహిత్ జువెల్లర్స్' అనే బంగారు నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే నవ్కార్ జువెల్లరీ దుకాణ యజమాని అనిల్కు, శ్రీనివాస్ వర్మకు నగలకు సంబంధించిన లావేదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలో అనిల్ డబ్బులు ఇస్తానని చెప్పడంతో శ్రీనివాస వర్మ తన వద్ద పనిచేసే వర్కర్ రూపారామ్ను పంపించాడు. అతను మంగళవారం రాత్రి 8గంటలకు మొదటి అంతస్తులోని అనిల్ షాపులో నుంచి రూ. 30లక్షలు తీసుకుని కిందకు మెట్లపై నుంచి దిగుతున్నాడు.
కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి..
అదే సమయంలో మెట్ల వద్దకు వచ్చిన ఓ దుండగుడు రూపారామ్ను అడ్డగించి కళ్లల్లో పెప్పర్ స్ప్రే చేసి చేతిలోని నగదు బ్యాగును లాక్కుని పరారయ్యాడు.
వెంటనే రూపారామ్ తన యజమాని దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో దుకాణ యజమాని మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ కెమారాల్లో రికార్డు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. అంతేగాక, ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కాగా, అక్కడే సిద్ధంగా ఉన్న మరో వ్యక్తి బైక్పై ఎక్కి.. చోరీ చేసిన దుండగుడు పారిపోయాడని సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు.
చోరీకి గురైన బైక్లోనే...
కాగా, నిందితులు ఉపయోగించిన బైక్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 రోజుల క్రితమే చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్ వార్, అదనపు డీసీసీ శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ లు పరిశీలించారు. ఈ దోపిడీపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.